Today XPoSAT : న్యూఇయర్ 2024 మొదటిరోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో కొత్త ఎత్తుకు చేరుకోనుంది. కాసేపట్లో (ఉదయం 9.10 గంటలకు) ‘ఎక్స్పోసాట్’ (XPoSAT) ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి పీఎస్ఎల్వీ-సీ58 వాహక నౌకను ఇస్రో ఉపయోగిస్తోంది. XPoSAT అంటే ‘ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్’. ఈ ఉపగ్రహ ప్రయోగం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే దీని ద్వారా పాలపుంతలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం అంతరిక్షంలో నిర్దిష్ట గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అక్కడ తిరుగుతూ ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీలాగా సమాచారాన్ని సేకరించి ఇస్రోకు పంపుతుంటుంది. ఖగోళం నుంచి భూమి వైపుగా ప్రసరించే మిస్టీరియస్ కాస్మిక్ కిరణాల గుట్టును కూడా విప్పుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
- గతంలో అమెరికా మాత్రమే ఈ తరహా ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
- అమెరికా పంపిన ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ శాటిలైట్ పేరు NASA IXPE.
- ఇస్రో XPoSat ఉపగ్రహ ప్రయోగం కోసం రూ.250 కోట్లు ఖర్చు కాగా.. 2021 సంవత్సరంలో NASA నిర్వహించిన IXPE ప్రయోగం కోసం ఏకంగా రూ.1500 కోట్లు ఖర్చయ్యాయి. అంటే చాలా తక్కువ ఖర్చులో మన ఇస్రో అదే తరహా ప్రయోగాన్ని చేయగలుగుతోంది.
- NASA IXPE శాటిలైట్ జీవితకాలం కేవలం రెండేళ్లే.
- మన ఇస్రో ఇప్పుడు పంపుతున్న XPoSat ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు.
- చంద్రయాన్-3, ఆదిత్య L1 మిషన్ల సక్సెస్ అందించిన పరంపరను కొనసాగిస్తామనే ధీమాలో ఇస్రో(Today XPoSAT) ఉంది.