Women Power List : ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ‘ఫోర్బ్స్ ఇండియా’ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశాకు చెందిన ఓ గిరిజన యువతి స్థానం సంపాదించారు. ఆమె పేరు.. జయంతి బురుడా. మల్కన్గిరి జిల్లా వాస్తవ్యురాలు. జర్నలిస్ట్గా ఉంటూ గ్రామీణ ప్రాంతంలో గిరిజన బాలికలకు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతపై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. రుతుక్రమం సమయంలో పరిశుభ్రత, శానిటరీ ప్యాడ్లను ఉపయోగించేలా మహిళలను చైతన్యపరుస్తోంది. మల్కన్గిరి జిల్లాలోని గిరిజన బాలికలకు విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు 2018లో ‘జంగిల్ రాణి బడా దీదీ’ అనే సంస్థను జయంతి ఏర్పాటు చేశారు. అందువల్లే ఇండియాలోనే అత్యంత శక్తిమంతమైన 23 మంది మహిళల్లో ఆమెకూ చోటు దక్కింది. ఈ లిస్టులో(Women Power List) జయంతితో పాటు ప్రపంచ బ్యాంక్ ఎండీ అనూషా కాంత్, క్రికెటర్ ప్రతిభా శర్మ, బాలీవుడ్ యాక్టర్ కృతిసనన్ కూడా ఉండటం విశేషం.
We’re now on WhatsApp. Click to Join
జర్నలిస్ట్గా మారి గిరిజన మహిళలకు సాయం చేయాలని జయంతి నిర్ణయించుకున్నారు. కానీ తన తల్లిదండ్రులు అందుకు అంగీకరించకోపోవడంతో ఆమె ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్నేహితుల ఆర్థిక సహాయంతో ఒడిశాలోని కోరాపుట్ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేశారు. ఆ సమయంలోనే గిరిజన మహిళలు పడుతున్న కష్టాలను వార్తల ద్వారా వెలుగులోకి తీసుకురావాలని జయంతి నిర్ణయించుకున్నారు. అందుకోసం 2015లో ఒక టెలివిజన్ ఛానెల్లో జిల్లా కరస్పాండెంట్గా చేరారు.
జయంతి ఏర్పాటుచేసిన ‘జంగిల్ రాణి బడా దీదీ’ సంస్థలో ప్రస్తుతం 100 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా గిరిజన బాలికల్లో ఉన్నత విద్య, బాల్య వివాహాలు రుతుక్రమ సమయంలో శానిటరీ ప్యాడ్ల వినియోగం, టీనేజ్ బాలికలకు గుడ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పిస్తున్నారు. గిరిజన మహిళలకు మొబైల్స్ వినియోగం, వీడియోల రికార్డ్ చేయటం, కథలను రాయటం నేర్పిస్తున్నారు. జిల్లాలోని 50మంది మహిళలతో కలిసి ‘హమా కహానీ, హమా ద్వారా, హమా పెయిన్’ పేరుతో న్యూస్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించారు. అందులో గిరిజన మహిళలు పడుతున్న కష్టాలను గురించి చెబుతున్నారు.
‘‘ఫోర్బ్స్ జాబితాలో పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. చేసిన పనికి గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఘనతను నాకు మద్దుతుగా నిలిచిన వాలంటీర్లకు ఇస్తున్నా. గిరిజన మహిళలు గౌరవంగా జీవించే వరకు నేను ప్రయత్నిస్తూ ఉంటా’’ అని జయంతి చెప్పారు. ‘‘ఆశ్రమ పాఠశాల్లో టీనేజ్ బాలికలు గర్భం ధరించడం నేను చూశాను. ఆదివాసీ మహిళలు ఇలాంటి సమస్యల గురించి మాట్లాడలేకపోతున్నారు. నేను వారి కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకు జర్నలిస్టు అయ్యాను. ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ‘జంగిల్ రాణి బడా దీదీ’ సంస్థను ప్రారంభించాను’’ అని ఆమె పేర్కొన్నారు.