Site icon HashtagU Telugu

Nepal Vs India : నేపాల్ బరితెగింపు.. భారత భూభాగాల మ్యాప్‌తో కరెన్సీ నోట్లు

Nepal New Banknotes Indian Territories

Nepal Vs India : భారత్, నేపాల్ మధ్య మరో కొత్త వివాదం రాచుకుంది. నేపాల్‌  సెంట్రల్‌ బ్యాంక్ ఇటీవలే ముద్రించిన కరెన్సీ నోట్లపై ఉన్న మ్యాప్‌లో భారత్‌కు చెందిన లిపులేక్‌, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలను కూడా డిస్‌ప్లే చేశారు. ఈ కొత్త మ్యాప్‌తో కూడిన కరెన్సీ నోట్ల ముద్రణ ఆరు నెలల నుంచి ఏడాదిలోగా పూర్తవుతుందని నేపాల్ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతినిధి దిల్‌రామ్‌ పోఖ్రాల్‌ వెల్లడించారు.  ఈ నోట్ల ముద్రణకు సంబంధించిన ప్రతిపాదనకు మే 3నే  అప్పటి నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ నేతృత్వంలోని మంత్రివర్గం పచ్చజెండా ఊపిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా ఉన్న టైంలోనూ ఇలాగే కరెన్సీ నోట్లను ముద్రించారు. భారత్ ఏరియాలను చేర్చుకొని మ్యాప్‌లను విడుదల చేశారు. చైనా సూచనలతోనే నేపాల్‌ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని తెలుస్తోంది.  లిపులేక్‌, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్‌ 2020లో సరికొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. వాటికి నాడు నేపాల్ పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది. భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా అప్పట్లో నేపాల్(Nepal Vs India) ప్రభుత్వం పట్టించుకోలేదు.

Also Read :Bigg Boss 8 : బిగ్‍బాస్ హౌస్‌లోకి చైతు, శోభిత.. నెటిజన్ల ఎదురుచూపులు

నేపాల్‌లోని దర్చులా జిల్లా సరిహద్దుల్లోనే  ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్‌ ఉంది. ఈప్రాంతం మీదుగానే మహాకాళి నది ప్రవహిస్తోంది. పితోడ్‌గఢ్‌ జిల్లా శివార్లలోనే కాలాపానీ ప్రాంతం ఉంది. కాలాపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి.  నేపాల్‌, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా కాలాపానీ ఏరియా భారత్‌కు చాలా ముఖ్యమైంది.  కాలాపానీలోనే మహాకాళి నది పుడుతుంది కాబట్టి దాని పశ్చిమభాగం మొత్తం తమదేనని భారత్ అంటోంది. దీంతో మహాకాళి నదికి తూర్పున ఉన్న కాలాపానీ ఏరియా, లిపులేఖ్ కనుమదారి మొత్తం తమ దేశం కిందకు వస్తుందని నేపాల్ అంటోంది. 1962లో చైనా అక్రమ చొరబాట్ల కారణంగా లిపులేఖ్ కనుమదారిని మూసేశారు.1879లో బ్రిటిషు ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపానీ ఏరియా మొత్తం భారత్‌లోనే ఉంది. తాము కొత్తగా ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించుకోలేదని భారత్‌ స్పష్టంచేస్తోంది.

Also Read :Teachers Day 2024 : ఉపాధ్యాయ దినోత్సవం.. సర్వేపల్లి రాధాకృష్ణన్ కెరీర్‌లోని స్ఫూర్తిదాయక విశేషాలివీ