NEET Paper Leak: నీట్ పేపర్ లీక్

సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై తీవ్రంగా స్పందించారు. మన దేశంలో పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న వివాదాలను అరికట్టేందుకు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల అక్రమాలను నియంత్రించేందుకు చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించిన […]

Published By: HashtagU Telugu Desk
Neet Paper Leak

Neet Paper Leak

సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై తీవ్రంగా స్పందించారు. మన దేశంలో పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న వివాదాలను అరికట్టేందుకు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల అక్రమాలను నియంత్రించేందుకు చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను, తీవ్రమైన అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మే 12న రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో వెల్లడిస్తామని ఎన్టీయే తెలిపింది. ఈ పరిణామం అత్యంత దురదృష్టకరమని ఆనంద్ కుమార్ అన్నారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిందితులను పట్టుకోవడం మంచి పరిణామమే అయినా, విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కోచింగ్ సెంటర్లపై కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. “కోచింగ్ సెంటర్లపై గట్టి నియంత్రణ అవసరం. చైనాలో 2021లో తెచ్చిన ‘డబుల్ రిడక్షన్’ పాలసీ వంటివి ఇక్కడ అమలు చేయాలి” అని ఆయన అన్నారు. ఈ విధానం కింద లాభాపేక్షతో నడిచే ప్రైవేట్ ట్యూషన్లను నియంత్రించడం, వారాంతాలు-సెలవుల్లో తరగతులను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. వారి జాతీయ ప్రవేశ పరీక్ష ‘గావోకావో’లో చీటింగ్‌ను అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ, నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నారని వివరించారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించింది. ‘గెస్ పేపర్లు’ లీక్ కావడం వల్లే ఈ అక్రమాలు జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో కోచింగ్ నెట్‌వర్క్‌లు, మధ్యవర్తుల పాత్రపై సీబీఐ దృష్టి సారించనుంది. ఈ ఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, భద్రతను పెంచేందుకు సమూల సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా బలపడుతున్నాయి.

  Last Updated: 12 May 2026, 05:10 PM IST