Site icon HashtagU Telugu

PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా కేంద్రం పెద్దఎత్తున సవరణలు చేపట్టడంతో ఈ సంఖ్య తగ్గిపోయింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌–మార్చి మధ్య 10,06,85,615 మంది రైతులు ఈ పథకం కింద డబ్బు పొందగా, 2025–26 ఏప్రిల్‌–జులై మధ్య కాలానికి అది 9,71,41,402కు తగ్గిపోయింది. అంటే నాలుగు నెలల్లోనే 35,44,213 మంది రైతుల పేర్లు తొలగించబడ్డాయి. జులై తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నందున, ప్రస్తుతం తొలగించిన వారి సంఖ్య 60 లక్షల దాకా చేరి ఉండొచ్చని అంచనా.

Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

ఈ తొలగింపుల వెనుక రెండు ప్రధాన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. మొదటిది – పథకం దుర్వినియోగాన్ని అరికట్టడమే. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, ఒకే కుటుంబంలో భార్యాభర్త ఇద్దరూ లబ్ధిపొందడం వంటి సందర్భాలు అనేక రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. ఇలాంటి అనర్హుల పేర్లను గుర్తించి తొలగించడం ద్వారా నిజమైన రైతులు మాత్రమే లబ్ధి పొందేలా కేంద్రం కృషి చేస్తోంది. రెండవ కారణం ఆర్థిక ప్రణాళికకు సంబంధించినది. త్వరలో పీఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి ఇచ్చే రూ.6,000 లబ్ధిని రూ.9,000కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం అదనపు నిధులు అవసరమవుతాయి. అందుకే అనర్హులను తొలగించడం ద్వారా ఆదా అయ్యే డబ్బును అదే పథకంలో అర్హులైన రైతుల లబ్ధి పెంచేందుకు వినియోగించాలనే ఆలోచనతో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

ఇప్పటికే తొలగించిన 35 లక్షల పేర్లతో కేంద్రానికి సుమారు రూ.2,126 కోట్లు ఆదా కాగా, మరిన్ని పేర్లు తొలగిస్తే మొత్తం ఆదా రూ.5,000 కోట్ల దాకా చేరే అవకాశముంది. ఈ డబ్బుతో లబ్ధిని రూ.9,000కు పెంచే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి. అయితే ఈ తొలగింపుల వల్ల పీఎం కిసాన్ 21వ విడత చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా డబ్బు జమ కాలేదు. రైతులు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లో “Know Your Status” మరియు “eKYC” ఆప్షన్ల ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. తప్పుగా పేరు తొలగించబడితే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్న రైతులు తమ సమాచారాన్ని సరిచేసి అప్డేట్‌గా ఉంచుకుంటే, పథకం లబ్ధిని నిరంతరంగా పొందవచ్చు.

Exit mobile version