Omar Abdullah : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమిపాలయ్యారు. శ్రీగుప్వారా బిజ్బెహరా అసెంబ్లీ స్థానంలో ఆమె ఓడిపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ షా అక్కడ విజయం సాధించారు. ఇల్తిజా ముఫ్తీపై 35వేలకుపైగా ఓట్ల మెజారిటీని బషీర్ షా సాధించినట్లు సమాచారం. దీంతో ఓటమిని అంగీకరిస్తూ ఆమె ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
Also Read :Kamala Harris Vs Putin : ‘‘నేను ప్రెసిడెంట్ అయితే’’.. పుతిన్పై కమల కీలక వ్యాఖ్యలు
ఎన్నికల్లో తన కోసం పనిచేసిన పీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఇల్తిజా ధన్యవాదాలు తెలిపారు. ఓడిపోయినప్పటికీ శ్రీగుప్వారా బిజ్బెహరా (Omar Abdullah) అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ఆమె చెప్పారు. వారితో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక శ్రీగుప్వారా బిజ్బెహరా స్థానంలో విజయఢంకా మోగించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ షా 2014 ఇదే స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో పీడీపీ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ భట్ గెలిచారు. ఈసారి సీన్ రివర్స్ అయింది. బషీర్ షాకు ప్రజలు పట్టం కట్టారు. జమ్మూకశ్మీర్లో పీడీపీ ఐదు అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో పీడీపీ 33 స్థానాలు గెల్చింది. అంటే దాదాపు 28 స్థానాలను పార్టీ కోల్పోయింది. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 50కిపైగా స్థానాలను కైవసం చేసుకోబోతోందని ప్రస్తుత ఫలితాల ట్రెండ్ను బట్టి స్పష్టం అవుతోంది.
Also Read :CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో దూసుకుపోతున్నాారు. బుద్గామ్లో ఆయన గెలిచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. అయితే గండేర్ బల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. బుద్గామ్లో పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీపై అబ్దుల్లా దాదాపు 5,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గండేర్ బల్లో పీడీపీ అభ్యర్థి బషీర్ అహ్మద్ మీర్పై అబ్దుల్లా దాదాపు 2,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.