Manoj Sinha : ఉగ్రవాదులకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరిక..

Manoj Sinha : లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. పాకిస్థాన్‌పై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Manoj Sinha warning to terrorists

Manoj Sinha warning to terrorists

Terrorist Attacks : హమ్‌హమాలోని ఎస్‌టిసిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) పాసింగ్ అవుట్-కమ్-అటెస్టేషన్ పరేడ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న విభిన్న ఉగ్రవాద దాడులపై ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తూ.. లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. పాకిస్థాన్‌పై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్‌లో పాక్ నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాకిస్థాన్‌ నిరంతరం మద్దతు ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల గందర్‌బల్, బారాముల్లాలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మన వీర సైనికులు, పౌరులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో నిమగ్నమైన కార్మికులు వీరమరణం పొందినట్లు గుర్తుచేశారు. భారతదేశపు మొదటి రక్షణ శ్రేణి అయిన బీఎస్‌ఎఫ్ తమ విధులను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు.

మరోవైపు.. రోజురోజుకూ జమ్మూకశ్మీర్‌లో  పెరుగుతున్న ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఆర్మీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బారాముల్లా ఉగ్రదాడిపై భారత సైన్యం ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ శుక్రవారం స్పందించారు. దాడి చేసిన వారికి సరిహద్దుల ఆవల నుంచి మద్దతు లభిస్తోందన్న అనుమానాల దృష్ట్యా సైన్యం తన వ్యూహాలపై పునరాలోచన చేస్తోందని చెప్పారు. నిర్దిష్ట కార్యాచరణ సమాచారాన్ని పంచుకోలేనప్పటికీ.. ఉద్భవిస్తున్న బెదిరింపులను ఎదుర్కోవటానికి సైన్యం తన వ్యూహాలను సర్దుబాటు చేస్తోందని ఆయన అన్నారు.

Read Also: Electricity Charges : తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. డిస్కంల ప్రతిపాదనలివీ

  Last Updated: 26 Oct 2024, 05:58 PM IST