Muslim State : దేశంలో ఇస్లామిక్ పాలనను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు ఉన్నట్టుగా కనిపిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్ను ముస్లిం రాష్ట్రంగా మార్చాలని మమతా బెనర్జీ యోచిస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. “బెంగాల్ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉండాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని ఒక మంత్రి జర్నలిస్టులకు ‘మినీ-పాకిస్తాన్’ అని పిలిచే గైడెడ్ టూర్ అవకాశాన్ని కల్పించారు. అందుకే యావత్ బెంగాల్ రాష్ట్రాన్ని మినీ-పాకిస్తాన్గా(Muslim State) మార్చాలని అనుకుంటున్నట్లు అనిపిస్తోంది’’ అని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘కేంద్రంలో మేం తిరిగి అధికారంలోకి వస్తే జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్సీఆర్), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)లను అమలు చేస్తాం. జనాభా నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటాం. కిమ్ జోంగ్ ఉన్ లాంటి మమతా బెనర్జీ నియంతృత్వ పాలనకు ముగింపు పలుకుతాం’’ అని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తమను తాము బీసీల శ్రేయోభిలాషులుగా చెప్పుకుంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలో ముస్లింలకు ఓబీసీ హోదాను కల్పించడం ద్వారా బీసీల కోటాకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తోంది. భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చే పెద్ద ప్రణాళికను ఈ పరిణామం సూచిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్లోని బెగుసరాయ్ లోక్సభ స్థానం నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్ వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు.
పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు. పశ్చిమబెంగాల్లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొందని, పీఓకేలో ఆజాదీ నినాదాలు వినపడుతున్నాయని తెలిపారు.