Locals Vs Cops Clash : కాంగ్రెస్ పాలిత రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లోని షిమ్లా నగరంలో బుధవారం ఉదయం ఉద్రిక్తత ఏర్పడింది. నగరంలో ఓ మసీదులో అక్రమ నిర్మాణం జరుగుతోందంటూ కొంతమంది స్థానికులు నిరసనకు దిగారు. ఆ మసీదు ఉన్న సంజౌలీ ఏరియా వైపుగా దూసుకెళ్లేందుకు యత్నించారు. ‘‘హిమాచల్ నే ఠానా హై.. దేవ్ భూమీ కో బచానా హై.. భారత్ మాతా కీ జై’’ అంటూ నిరసనకారులు బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు.. మసీదుకు వెళ్లే మార్గం మధ్యలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే నిరసనకారులు ఆ బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో వారిపై లాఠీఛార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నిరసనకారులపైకి వాటర్ క్యానన్లను(Locals Vs Cops Clash) ప్రయోగించారు. అక్కడి నుంచి వారిని చెదరగొట్టి వెనక్కి పంపించేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Also Read :Khalistani State : ఖలిస్తాన్ డిమాండ్ను సమర్థించేలా రాహుల్ వ్యాఖ్యలు : తీవ్రవాది పన్నూ
ఈ ఘటనపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. ‘‘ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది. అయితే నిరసన అనేది శాంతియుతంగా ఉండాలి. ప్రజల ఆస్తులకు నష్టం తలపెట్టకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. షిమ్లా నగరంలోని సదరు మసీదులో జరుగుతున్న నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దానిపై ఇతరులు జోక్యం చేసుకోవడం తగదని సీఎం సూచించారు. పోలీసులు జారీ చేసిన ప్రొహిబిటరీ ఆర్డర్స్ను నిరసనకారులు ధిక్కరించడం వల్ల వారిని లాఠీఛార్జీతో అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై కొన్ని హిందూ సంఘాలు రాద్ధాంతం చేస్తుండటాన్ని సీఎంసుఖ్విందర్ సింగ్ సుఖు ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకే తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. మత సామరస్యం, సోదర భావనకు హిమాచల్ ప్రదేశ్ ప్రతీక అని సీఎం చెప్పారు.