Shock To Hafiz Saeed : ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ లో తగిన శాస్తి జరుగుతోంది. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబాలోకి రిక్రూట్ చేసుకునే పిల్లలకు ఉగ్రవాద పాఠాలను నేర్పించే ముఫ్తీ ఖైజర్ ఫరూక్ను కరాచీలో గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. కరాచీలోని పోర్ట్ ఖాసిమ్లో ఉన్న జామియా మసీదు అబూబకర్ నుంచి బయటికి వస్తున్న ఖైజర్ ఫరూక్ పై గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న సీన్ లను బట్టి.. ఇద్దరు దుండగులు మసీదు ఎదుట బైక్ పై ఎదురుచూస్తూ కూర్చున్నారు. హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్ ఫరూక్ బయటికి రాగానే.. అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఖైజర్ ఫరూఖ్ మృతిచెందగా, ఒక విద్యార్థి గాయపడ్డాడు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో ఫరూక్ నివసించేవాడు.
టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతడు జైలుకు వెళ్లినప్పటి నుంచి లష్కరే తైబాలో ఆధిపత్య పోరు మొదలైంది. ఈక్రమంలోనే లష్కరే చీఫ్ సహచరులు ఒక్కొక్కరుగా మర్డర్ కు గురవుతున్నారని పాకిస్థాన్ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ హత్యా ఘటనల నేపథ్యంలో జైలులోని హఫీజ్ సెల్కి భద్రతను పెంచారు. కాగా, ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుల్లో ఒకడైన కమాలుద్దీన్ సయీద్ మంగళవారం (సెప్టెంబర్ 26) నుంచి కనిపించకుండా పోయాడు. పెషావర్లో కారులో వచ్చిన దుండగులు కమాలుద్దీన్ సయీద్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కమాలుద్దీన్ ఆచూకీ వివరాలు బయటికి రాకముందే.. హఫీజ్ సయీద్ కీలక అనుచరుడు మర్డర్ కు గురికావడం గమనార్హం. పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆపద్ధర్మ సర్కారు ఉన్న తరుణంలో ఈ ఘటనలు జరుగుతుండటాన్ని ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇదంతా పాక్ నిఘా సంస్థ కనుసన్నల్లోనే జరుగుతోందని రక్షణ రంగ పరిశీలకులు (Shock To Hafiz Saeed) విశ్లేషిస్తున్నారు.