Kejriwal started the election campaign: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆయన యమునానగర్లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు. హర్యానాలోని 90 నియోజకవర్గాలకు ‘ఆప్’ సొంతంగానే పోటీ చేస్తోంది.
Read Also: Pawan Kalyan : కుమార్తెకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్..
సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా తాను “అగ్నిపరీక్ష’కు సిద్ధమైనట్టు కేజ్రీవాల్ ఇటీవల తన రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. ”నేను అగ్నిపరీక్షకు సిద్ధమయ్యాను. రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకున్నప్పుడు సీతమ్మ తల్లి అగ్నిపరీక్షను ఎదుర్కొంది. అలాంటి పరీక్షనే ఇవాళ నేను ఎదుర్కొంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడు కాదని ప్రజలు అనుకుంటే నాకు ఓటు వేయవద్దు. కానీ నేను నిజాతీపరుడని విశ్వసిస్తేనే ఓటు వేయండి. ఢిల్లీ ప్రజలు తిరిగి ఎన్నుకున్నప్పడే సీఎం పదవి చేపడతాను” అని కేజ్రీవాల్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డబ్వాలీ, రానియా, భివాని, మెహమ్, పుండ్రి, రేవారి, దాద్రి, అస్సాంథ్, బల్లడ్గఢ్, బద్ర నియోజకవర్గాల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. కీలక నగరాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రధానంగా స్థానిక అంశాలపై ప్రసంగించనున్నారు. హర్యానాలో కాంగ్రెస్తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో అవగాహన కుదరకపోవడంతో ఆప్ సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది.
మరోవైపు కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్కు వసతి కల్పించాలని కోరింది. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.