ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుమారు ఐదు నెలల పాటు తీహార్ జైలులో గడిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఇటీవల తన జైలు అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో చూపించేంత భయంకరంగా తీహార్ జైలు ఉండదని, అక్కడ చాలా మంది చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న అమాయకులు ఉన్నారని ఆమె పేర్కొన్న మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా తీహార్ జైలు అంటే కరుడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదులు ఉండే అత్యంత క్రూరమైన ప్రదేశమని అందరూ భావిస్తుంటారు. అయితే, వాస్తవానికి అక్కడ అంత ‘సీన్’ లేదని కవిత అభిప్రాయపడ్డారు. సినిమాల్లో ఇచ్చే ఎలివేషన్ల వల్ల దానికి అటువంటి ఇమేజ్ వచ్చిందని, కానీ అక్కడ చిన్న చిన్న ‘పెట్టీ’ కేసుల్లో ఇరుక్కున్న వారు ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారని ఆమె వెల్లడించారు. అరటిపండు దొంగతనం చేసినందుకు, పాన్ షాపులో మజా డబ్బా కోసం గొడవ పడినందుకు కూడా వ్యక్తులను తీసుకెళ్లి తీహార్ జైలులో పడేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. భార్యాభర్తల గొడవల వంటి చిన్న కారణాలతో ఏడు, ఎనిమిదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని చూసి షాక్ అయ్యానని ఆమె తెలిపారు.
జైలులో తాను ఉన్న సమయంలో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఖైదీలుగా రావడాన్ని కవిత ప్రస్తావించారు. వారు పనిచేస్తున్న థాయ్లాండ్ ఆధారిత కంపెనీ సైబర్ క్రైమ్స్కు పాల్పడుతోందనే ఆరోపణలతో, ఆ నేరంతో ఎటువంటి సంబంధం లేని అమాయక యువకులను కూడా తీహార్ జైలుకు తీసుకువచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో వారిని నేరస్థులుగా పరిగణించడం విచారకరమని అన్నారు. వ్యవస్థలోని లోపాల వల్ల ఎంతో మంది అమాయకులు తీహార్ వంటి భారీ జైళ్లలో కాలం వెళ్లదీస్తున్నారని ఆమె తన ఇంటర్వ్యూలో వివరించారు.
తనను జైలు నుంచి కోర్టుకు తరలించే సమయంలో ఎదురైన పరిస్థితుల గురించి కూడా కవిత మాట్లాడారు. ఒక సందర్భంలో తన చేతులకు సంకెళ్లు (Handcuffs) వేశారని, అయితే మరో ఉన్నతాధికారి జోక్యంతో వాటిని తొలగించారని ఆమె గుర్తుచేసుకున్నారు. తనను కోర్టుకు తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రయాణంలో తాను చాలా ఒంటరిననే భావన కలిగిందని చెప్పుకొచ్చారు. రౌస్ అవెన్యూ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో, ఐదు నెలల జైలు జీవితం తనకు ప్రపంచాన్ని చూసే కొత్త కోణాన్ని నేర్పిందని ఆమె వ్యాఖ్యానించారు.
