ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మైనింగ్ స్కామ్ లో చిక్కారు. మైనింగ్ ను సొంతానికి కేటాయించుకున్న ఆయనకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సీఎం పదవిని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు, ఈడీ రంగంలోకి దిగడంతో ఆయన స్కామ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
ఈడీ చేసిన తనిఖీల్లో నోట్ల కట్టలు భారీగా బయటపడ్డాయి. రూ.2,000, రూ.500, రూ.200, రూ.100 నోట్లు కట్టలకొద్దీ వెలుగు చూడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గత నెలలో కుంతి జూనియర్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ అయిన రామ్ ప్రసాద్ సిన్హాను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు అతడిపై 16 ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పూజా సింఘాల్ తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల పేర్లను అతడు వెల్లడించాడు. ప్రస్తుతం ఆమె ఝార్ఖండ్ మైనింగ్, జియాలజీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
మైనింగ్ స్కామ్, ఉపాధి నిధుల దారి మళ్లింపునకు సంబంధించి ఆ రాష్ట్రంలోని 12 ప్రదేశాలతో పాటు బెంగాల్, బీహార్ లో దాడులు చేసింది. తాజాగా ఝార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి, ఆ రాష్ట్ర గనులు, భౌగోళికశాఖ కార్యదర్శి పూజా సింఘాల్ అత్యంత సన్నిహితుల నుంచి రూ.19.31 కోట్లను స్వాధీనం చేసుకుంది. అందులో పూజా సింగాల్ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సుమన్ కుమార్ దగ్గర్నుంచే రూ.17 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రాంతం నుంచి రూ.1.8 కోట్లు సీజ్ చేశారు. లెక్కల్లోలేని డబ్బుతో పాటు పలు డాక్యుమెంట్లనూ ఐఏఎస్ అధికారి ఇంటి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధి నిధుల్లో రూ.18 కోట్లు దారిమళ్లాయన్న కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి సన్నిహితుల నుంచి ఇంత డబ్బు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది.