PM Post : నితీశ్ కుమార్.. ఈసారి ఎన్డీయే ప్రభుత్వంలో కింగ్ మేకర్గా మారారు. ఆయనకు 12 ఎంపీ సీట్లే ఉన్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ 272 లోక్సభ సీట్లకు చేరుకోవడంలో బీజేపీకి ప్రధానంగా సహాయాన్ని అందిస్తున్నారు. అందువల్ల నితీశ్ కుమార్కు బీజేపీ టాప్ ప్రయారిటీ ఇస్తోంది. ఈనేపథ్యంలో ఓ సంచలన విషయాన్ని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వెల్లడించారు. ‘‘నితీశ్ కుమార్కు ఇండియా కూటమి నేరుగా ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసింది. అయితే ఆయన ఆ ఆఫర్ను తిరస్కరించారు. ఎన్డీయేతోనే తాను ఉంటానని నితీశ్ స్పష్టం చేశారు’’ అని కేసీ త్యాగి చెప్పారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవివరాలను ఆయన వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నితీశ్ కుమార్కు ప్రధానమంత్రి(PM Post) పదవిని ఆఫర్ చేసిన నాయకుడు లేదా నాయకులు ఎవరు ?’’ అని కేసీ త్యాగిని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆ పేర్లు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ‘‘కొందరు ఇండియా కూటమి నాయకులు ఈ ఆఫర్పై చర్చించేందుకు నేరుగా నితీష్ కుమార్ను కలవాలని కూడా ప్రయత్నించారు. గతంలో మేం ఇండియా కూటమి నాయకుల తీరుకు నిరసనగానే అక్కడి నుంచి బయటికొచ్చాం. ఇప్పుడు మళ్లీ వాళ్లతో చేరం. ఎన్డీయేలో చేరాం. ఎన్డీయేలోనే కొనసాగుతాం. ఇక్కడి నుంచి వెనుదిరిగి చూసే ప్రశ్నే లేదు’’ అని కేసీ త్యాగి స్పష్టం చేశారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో దేశంలోని మొత్తం 543 సీట్లకుగానూ 234 చోట్ల ఇండియా కూటమి గెలిచింది. ఇక బీజేపీ 240 సీట్లు సాధించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మొత్తంగా 293 సీట్లను కైవసం చేసుకుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్సభ సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు ఎన్డీయే వద్ద ఉంది. ఇందులో 12 సీట్లు జేడీయూకు, 16 సీట్లు టీడీపీ వద్ద ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఒకవేళ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగితే.. ఎన్డీయే ఎంపీల బలం 265కు పడిపోతుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272ను బీజేపీ కోల్పోతుంది. అందుకే ఎన్డీయే కూటమిలో జేడీయూ, టీడీపీ అంత ముఖ్యంగా మారాయి.