Indian Student : అమెరికాలోని న్యూజెర్సీలో దారుణం జరిగింది. యష్కుమార్ బ్రహ్మభట్ (38) అనే భారత విద్యార్థి ఘాతుకానికి తెగబడ్డాడు. న్యూజెర్సీలోని మిడిల్సెక్స్ కౌంటీలో ఏకంగా తన బంధువులపైనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72) అక్కడికక్కడే చనిపోయారు. కాల్పులు జరిపిన యష్కుమార్ బ్రహ్మభట్కు కూడా గాయాలు కావడం గమనార్హం. యష్ కుమార్ హత్య చేసిన ఇద్దరిలో ఒకరు అమ్మమ్మ, మరొకరు అంకుల్ అవుతారని తెలిసింది. దీంతో యష్కుమార్పై హత్యానేరం, అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే అభియోగాలను మోపి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంతకీ తన అమ్మమ్మ, అంకుల్లను యష్ కుమార్ ఎందుకు చంపాడనేది ఇంకా తెలియరాలేదు. యష్కుమార్ బ్రహ్మభట్ గుజరాత్లోని ఆనంద్ జిల్లా వాస్తవ్యుడు. తన తాతయ్య (అమ్మ వాళ్ల నాన్న) ఒత్తిడి చేయడం వల్లే ఉన్నత విద్య కోసం అతడు 18 నెలల క్రితం అమెరికాకు వచ్చాడని సమాచారం. ఇప్పుడు యష్కుమార్ బ్రహ్మభట్ చేతిలో హత్యకు గురైన వారిలో అమ్మమ్మ బిందు బ్రహ్మభట్ కూడా ఉండటం గమనార్హం. హత్యకు దారితీసేలా వారి మధ్య ఏదైనా గొడవ జరిగిందా ? మరేదైనా కక్షతో ఈ హత్యకు పాల్పడ్డాడా ? అనేది తెలియాల్సి ఉంది.