3000 New Trains : వచ్చే ఐదేళ్లలో దేశంలో 3వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తేవాలని భారత సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతమున్న రైళ్ల ద్వారా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 800 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కొత్తగా 3వేల రైళ్లు వస్తే.. ప్రయాణికుల సంఖ్య 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈవివరాలను స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. 3,000 కొత్త రైళ్లు వచ్చేస్తే.. వాటితో అదనంగా అనేక ట్రిపుల రైల్వే సర్వీసులు మొదలవుతాయని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
భారతీయ రైల్వేలకు 69,000 కొత్త కోచ్లు అందుబాటులో వచ్చాయని, ప్రతి సంవత్సరం దాదాపు 5,000 కొత్త రైల్వే కోచ్లను తయారు చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం 200 నుంచి 250 కొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. వచ్చే కొన్నేళ్లలో మరో 450 వందేభారత్ రైళ్లను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఒకదాని వెంట మరొకటిగా కలిసి ఉండే 22 కోచ్లతో కూడిన రైళ్లను తేవాలనే ప్రపోజల్ కూడా ఉందన్నారు. దీనివల్ల ప్రయాణికులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ట్రైన్ల వేగం పెంచడంపై, వంకరటింకర రైళ్ల రూట్లను సూటిగా చేయడంపైనా ఫోకస్ చేస్తున్నామని (3000 New Trains) ఆయన వివరించారు.