Army Couple March : తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో దంపతులు పాల్గొనబోతున్నారు. ఆర్మీ మేజర్ జెర్రీ బ్లైజ్, కెప్టెన్ సుప్రీత సీటీ దంపతులు గణతంత్ర దినోత్సవం నాడు(జనవరి 26న) ఢిల్లీలో జరిగే ‘కర్తవ్య పథ్’ పరేడ్లో పాల్గొననున్నారు. అయితే వారిద్దరూ వేర్వేరు కంటింజెంట్లలో సభ్యులుగా పరేడ్లో పాల్గొంటారు. తాము పరేడ్లో పాల్గొనే సందర్భం రావడం యాదృచ్ఛికమని మేజర్ బ్లైజ్ చెప్పారు. ‘‘కర్తవ్యపథ్ వద్ద 2016లో జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే పరేడ్లోనూ నా భార్యతో కలిసి పాల్గొన్నాను. అంతకుముందు 2014లో జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్లోనూ నేను, నా భార్య కలిసి పాల్గొన్నాం’’ అని ఆయన(Army Couple March) తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘ఇది ప్రణాళికాబద్ధంగా జరగలేదు. కేవలం యాదృచ్ఛికమే. తొలుత నిర్వహించిన పరేడ్ పరీక్షకు హాజరై పాస్ అయ్యాను. నా భర్త మద్రాస్ రెజిమెంట్ నుంచి ఎంపికయ్యారు’’ అని కెప్టెన్ సుప్రీత తెలిపారు. తామిద్దరం కాలేజీ టైంలోనూ నేషనల్ కెడేట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో కలిసి క్యాంపుల్లో పాల్గొన్నామన్నారు. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ను చూసేందుకు తమ ఇద్దరి కుటుంబ సభ్యులు ఢిల్లీకి వస్తున్నారని మేజర్ జెర్రీ బ్లైజ్, కెప్టెన్ సుప్రీత సీటీ చెప్పారు. కెప్టెన్ సుప్రీత.. కర్ణాటకలోని మైసూర్ జేఎస్ఎస్ లా కళాశాలలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తమిళనాడులోని వెల్లింగ్టన్ వాసి అయిన మేజర్ బ్లైజ్ బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఢిల్లీ పోలీసులు తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించనున్నారు. ఇదొక రికార్డు. ఈ దళానికి ఐపీఎస్ శ్వేత కె సుగాధన్ నాయకత్వం వహించనుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. ఇదీ రికార్డే. భారత త్రివిధ దళాలలో, రక్షణ దళాలలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఏటా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో ఢిల్లీ పోలీసులు సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించాలని, దానికి మరో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. ఎప్పుడో 1975లో ఢిల్లీ పోలీసు దళానికి నాటి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. ఈసారి మాత్రం పూర్తి మహిళా దళం పాల్గొననుండటం విశేషం. గణతంత్ర వేడుకలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది.