Operation Sindoor : పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతీయులు స్వాగతిస్తున్నారు. భారత్ జరిపిన దాడిలో దాదాపు 90 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తోంది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు గాయపడ్డారని సమాచారం. ఈవివరాలను బయటికి వెల్లడించడానికి పాకిస్తాన్ నిరాకరిస్తోంది. కేవలం 11 మందే చనిపోయారని బుకాయిస్తోంది. ఈనేపథ్యంలో ఇవాళ (బుధవారం) ఉదయం భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి, రక్షణ శాఖ ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కీలక వివరాలను వెల్లడించారు. ‘‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్, పీఓకేలో ఉన్న పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం’’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ‘‘ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్తాన్(Operation Sindoor) మారింది. లష్కరే తైబాకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాదులే 26 మంది అమాయక భారతీయులను చంపారు. కుటుంబ సభ్యుల ఎదుట నిర్దాక్షిణ్యంగా వారిని కాల్చి చంపారు. ఈ దారుణాన్ని యావత్ భారతీయులు, భారత ప్రభుత్వం సహించలేకపోయింది. అందుకే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం’’ అని విక్రమ్ మిస్రి చెప్పారు.
Also Read :Operation Sindoor : ఆపరేషన్ సిందూర్పై సీఎం రేవంత్ ట్వీట్.. అత్యవసర సమీక్ష
ఆపరేషన్ సిందూర్లో కీలక ఉగ్రస్థావరాలు ధ్వంసం
- ‘‘పాక్ ఆక్రమిత కశ్మీరు, పాకిస్తాన్లలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. వాటిని పాకిస్తాన్ ప్రభుత్వమే నడుస్తోంది. నిఘా వర్గాల సమాచారం వచ్చాకే.. ప్రజలు, జనావాసాలకు నష్టం కలిగించకుండా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. మేం చాలా బాధ్యతాయుతంగా దాడి చేశాం’’ అని మీడియా సమావేశం వేదికగా మహిళా సైనిక అధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ వివరించారు.
- ‘‘పీఓకేలో లష్కరే తైబాకు ఫిదాయిన్ ముఠా కేంద్రం ఉంది. ఇక్కడే ఆత్మాహుతి దాడులు చేసే ఉగ్రవాదులను తయారు చేస్తుంటారు. దీన్ని భారత్ పేల్చేసింది. భారత యుద్ధ విమానాల నుంచి ఈ స్థావరంపై బాంబులు వేశాం’’ అని తెలిపారు.
- ‘‘26/11 ముంబై ఉగ్రదాడిలో భాగమైన అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీలు ట్రైనింగ్ పొందిన ఒక ఉగ్రవాద స్థావరం పీఓకేలో ఉంది. దాన్ని కూడా భారత సైన్యం పేల్చేసింది’’ అని వారు పేర్కొన్నారు.
- ‘‘లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ పీఓకేలో మర్కజే మురీద్కే అనే ఉగ్ర స్థావరాన్ని నడుపుతున్నాడు. మురీద్కే ప్రాంతంలో ఇది ఉంది. ఈ ఉగ్రవాద స్థావరంలో ఏటా ఎంతోమందికి ఉగ్రవాద ట్రైనింగ్ ఇస్తున్నారు. దీన్ని కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది’’ అని సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ చెప్పారు.
- ‘‘బహావల్ పూర్లో ఉన్న మర్కజ్ సుబహానల్లా అనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నిలయం. అక్కడ ఎంతోమంది ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంటారు. దాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను కానీ, పాకిస్తాన్ ప్రజలను కానీ భారత సైన్యం టార్గెట్ చేయలేదు. వారికి నష్టం చేకూర్చలేదు’’ అని సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ వివరించారు.
- ‘‘భారత్ ధ్వంసం చేసిన 9 ఉగ్రవాద స్థావరాల్లో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీరులో.. నాలుగు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘ఒకవేళ భారత్పై పాకిస్తాన్ ప్రతీకార దాడికి దిగితే తగిన విధంగా బుద్ది చెబుతాం’’ అని స్పష్టం చేశారు.
త్రివిధ దళాల అధిపతులకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఫోన్
ఆపరేషన్ సిందూర్ పూర్తయ్యాక భారత త్రివిధ దళాల అధిపతులకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి సంబంధించిన వివరాలను రాజ్నాథ్కు త్రివిధ దళాల అధిపతులు వివరించారు. భారత సరిహద్దులోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు రక్షణశాఖ సమీక్షిస్తోంది.
Also Read :Operation Sindoor: 9 ఎయిర్పోర్ట్లు క్లోజ్.. వాయుసేన ఆధీనంలోకి శ్రీనగర్ ఎయిర్పోర్ట్
అవసరమైతే.. ఆపరేషన్ సిందూర్ 2
ఆపరేషన్ సిందూర్ అనేది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మొదటి దశ దాడి మాత్రమే అని సైనిక వర్గాలు అంటున్నాయి. ఒకవేళ భారత్పై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగితే ఆపరేషన్ సిందూర్ 2 కూడా చేస్తారని చెబుతున్నారు. ఆపరేషన్ సిందూర్పై కాసేపట్లో ప్రధాని మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని అంటున్నారు.