భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రాంచీలో శనివారం జరిగిన సిన్హా స్మారక ప్రారంభ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాను క్రియాశీల రాజకీయాల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. “నేను క్రియాశీల రాజకీయాల్లో చేరాలని ఆసక్తిగా ఉన్నాను, కానీ విధి మరోలా కోరింది. నేను కష్టపడి సాధించిన దాన్ని అంత ఈజీగా వదులుకోలేను” అని CJI రమణ అన్నారు. న్యాయవ్యవస్థ ఖాళీలను భర్తీ చేయకపోవడం, న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచకపోవడమే దేశంలో కేసులు పెండింగ్లో ఉండటానికి ప్రధాన కారణమని ఆయన నొక్కి చెప్పారు. న్యాయమూర్తుల జీవితాలపై తప్పుడు కథనాలపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. “న్యాయమూర్తులు వారి పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయడానికి భౌతికంగా, వ్యక్తిగతంగా మౌలిక సదుపాయాలను పునరుద్ధరించవలసిన ఆవశ్యకత గురించి గట్టిగా వాదిస్తున్నా’’ అని న్నారు. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తుల భద్రతపై సీజేఐ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు.
“ఈ రోజుల్లో న్యాయమూర్తులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయి. న్యాయమూర్తులు ఎలాంటి భద్రత లేకుండా జీవించాల్సిన పరిస్థితులున్నాయి. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పదవీ విరమణ తర్వాత వాళ్లకు భద్రత ఉంటుంది. కానీ న్యాయమూర్తులకు ఎలాంటి రక్షణ కల్పించబడదు.” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తోందని సీజేఐ మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.