Himachal Crisis : ఉత్తరాఖండ్‌లో హిమాచల్ ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేల క్యాంప్.. ఎందుకు ?

Himachal Crisis : హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది.

  • Written By:
  • Updated On - March 9, 2024 / 03:38 PM IST

Himachal Crisis : హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేయడంతో మొదలైన సంక్షోభం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఆ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా జతకట్టారు. వారంతా కలిసి మొత్తం 11 మంది శనివారం బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు. రిషికేష్‌లోని తాజ్ హోటల్‌లో ప్రస్తుతం 11 మంది హిమాచల్ రెబల్స్ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించేందుకు సీఎం సుఖ్వింధర్ సుఖు ఢిల్లీకి వెళ్లిన తరుణంలోనే 11 మంది ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్‌‌కు చేరడం గమనార్హం. ఈ పరిణామాలతో హిమాచల్ (Himachal Crisis) రాజకీయం హీటెక్కింది. ఏ క్షణం ఏదైనా జరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మను సింఘ్వీ ఓడిపోయారు. హిమాచల్ లోకల్ కాని వ్యక్తిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలిపినందుకు ఇలా చేశామని కాంగ్రెస్ రెబల్స్ చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ దేవిందర్ కుమార్ భుట్టోలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆరుగురు రెబల్స్‌తో చేతులు కలిపారు.దీంతో వారి సంఖ్య 9కి పెరిగింది. తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారితో చేయి కలిపారు.

Also Read : Salary Hike : ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు

బీజేపీ డైరెక్షన్‌లోనే రెబల్ ఎమ్మెల్యేలంతా ఉత్తరాఖండ్‌కు చేరినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది ఉన్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.  ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునే పార్టీకి అసెంబ్లీలో 35 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజాగా ఉత్తరాఖండ్‌లో క్యాంపు పెట్టిన 11 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ బీజేపీకి మద్దతు ప్రకటిస్తే.. బీజేపీ బలం 36కు పెరుగుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కమల దళం కైవసం అవుతుంది. బహుశా ఇదే వ్యూహంతో రెబల్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతోంది.  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సాక్షాత్తూ హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఆరోపిస్తున్నారు.

Also Read :30 Minutes Treatment : బ్రెయిన్ ట్యూమర్‌కు 30 నిమిషాల్లోనే చికిత్స