Punjab: మోడీని తరిమికొట్టడం.. ఖలిస్థాన్ స్వాతంత్య్రానికి నాంది

  • Written By:
  • Publish Date - January 6, 2022 / 03:56 PM IST

భద్రతా పరమైన వైఫల్యాల కారణంగా నిన్న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గుర్ పత్వంత్ సింగ్ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కాన్వాయ్ ను భారతీయ కిసాన్ మోర్చా అడ్డుకోవడంతో రోడ్డుపై 20 నిమిషాలు ఆగిపోయిన మోదీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.

దీనిపై గుర్ పత్వంత్ సింగ్ స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మోదీని పంజాబ్ నుంచి సిక్కులు తరిమికొట్టారని… ఇది ఖలిస్థాన్ స్వాతంత్య్రానికి నాంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని అడ్డుకున్న రైతులను ప్రశంసించారు. త్వరలో పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఖలిస్థాన్ కు రెఫరెండం వంటివని అయన అన్నారు.

ఖలిస్థాన్ రెఫరెండానికి నిన్నటి నుంచి ప్రచారం ప్రారంభమైందని… దీన్ని మోదీ ప్రభుత్వం గుర్తించాలని.. భారత జాతీయ జెండాను ధరించినవారు ఢిల్లీకి వెనుదిరగాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. స్వతంత్ర దేశంగా అవతరించాలని పంజాబ్ నిర్ణయించుకుందని చెప్పారు.

ఆయుధాలతో పంజాబ్ కు వచ్చిన ఇందిరాగాంధీకి ఆయుధాలతోనే సమాధానం లభించిందని అన్నారు. ఇప్పుడు మోదీ పంజాబ్ లో అలజడి సృష్టిస్తున్నారని… ఆయనకు శాంతియుతంగా ఓటుతో సమాధానం చెపుతామని వ్యాఖ్యానించారు. ఖలిస్థాన్ కు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూతో పాటు బీజేపీ, ఆప్ తదితర పార్టీలు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా సిక్కులను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.