Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించగా, అదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై మోదీ ప్రకటనతో గోల్డ్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో […]

Published By: HashtagU Telugu Desk
PM Modi

PM Modi

భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించగా, అదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై మోదీ ప్రకటనతో గోల్డ్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యం పెంచుకోవడంలో భాగంగా చమురు వాడకం తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగత వాహన వినియోగం తగ్గించుకోవాలని, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని కోరారు. ఇక్కడ ప్రధానంగా ఏడాది పాటు ప్రజలు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని మోదీ సూచించడం ఆశ్చర్యం కలిగించింది. పండగలు, శుభకార్యాలకు కూడా కొనుగోళ్లను తగ్గించుకోవాలని కోరారు. దీంతో సోమవారం సెషన్‌లో గోల్డ్ జువెల్లరీ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. ఆయా కంపెనీల మార్కెట్ విలువ వేల కోట్లు తగ్గగా, ఇన్వెస్టర్ల సంపద కూడా అదే స్థాయిలో భారీగా కుదేలైంది.

ఒకవైపు మోదీ ప్రకటన, కొవిడ్ నాటి చర్యల్ని గుర్తుకు చేయడంతో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం 1.40 గంటలకు సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో 76,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 200 పాయింట్లు తగ్గి 23,970 స్థాయిలో ఉంది. ఒక దశలో ఇంట్రాడేలో 1100 పాయింట్లకు పైగా పడిపోయింది.

ఈ క్రమంలోనే బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న మోదీ సూచనతో గోల్డ్ జువెల్లరీ స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి. మోదీ ప్రకటనతో ఆయా వ్యాపారాలపై ప్రభావం చూపుతుందన్న కారణంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. కల్యాణ్ జువెల్లర్స్ షేరు కిందటి రోజు రూ. 424.55 వద్ద ముగియగా ఇవాళ ఇంట్రాడేలో దాదాపు 10 శాతం తగ్గి రూ. 382 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 9 శాతం నష్టంతో కొనసాగుతోంది. టైటాన్ షేర్లు ఇంట్రాడేలో 8 శాతం కుదేలవగా.. ఇప్పుడు 7 శాతం నష్టంతో రూ. 4,230 వద్ద ఉన్నాయి.

సెంకో గోల్డ్ షేర్లు కూడా 12 శాతం వరకు కుదేలై ఇంట్రాడేలో రూ. 325.05 వద్ద కనిష్ఠాన్ని తాకగా, ప్రస్తుతం 8 శాతం నష్టంతో రూ. 340 స్థాయిలో ఉంది. స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షేర్లు ఇంట్రాడేలో 12 శాతానికి పైగా తగ్గగా, ప్రస్తుతం 8 శాతం నష్టంతో రూ. 500 స్థాయిలో ఉంది. పీఎన్ గాడ్గిల్ జువెల్లర్స్ షేర్లు కూడా 9 శాతం వరకు తగ్గాయి. పీసీ జువెల్లర్స్ లిమిటెడ్ షేర్లు 5 శాతం వరకు నష్టపోయాయి. మోదీ ప్రకటన వేళ మే 12న మోదీని కలవనున్నట్లు జువెల్లరీ అసోసియేషన్ ప్రకటించింది.

  Last Updated: 11 May 2026, 02:26 PM IST