Gold Costly: పసిడికి రెక్కల “కస్టమ్”..సుంకం పెంచిన కేంద్ర సర్కారు

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 07:30 AM IST

పసిడి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.50 శాతం నుంచి 12.50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని పెంచుతున్నందు వల్లే ఈ దిశగా సర్కారు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బంగారం దిగుమతులు ఇటీవల కాలంలో
ఒక్కసారిగా పెరిగాయి. మే నెలలో మన దేశానికి మొత్తం 107 టన్నుల బంగారం దిగుమతి అయింది. జూన్‌లో కూడా గణనీయంగా దిగుమతులు పెరిగాయి. ఈ పరిణామంతో కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి చాలా పెరిగింది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం పెంచేసింది. గతంలో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, ఇప్పుడు 12.5 శాతానికి చేరనుంది. దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్నుతో కలిపి బంగారంపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరింది. దీనికి 3 శాతం జీఎస్‌టీ అదనం. ఈ నిర్ణయంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి.

పెట్రోల్ , డీజిల్ ఎగుమతులపైనా..

ఇంధన దిగుమతులు, ఎగుమతులను నియంత్రించే చర్యలకూ కేంద్ర సర్కారు ఉపక్రమించింది. పెట్రోల్ , డీజిల్ ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాలను విధించింది. పెట్రోలుపై లీటరుకు రూ.6, డీజిల్‌పై లీటరుకు రూ.13 మేరకు పన్ను విధించింది. ముడి చమురుపై టన్నుకు రూ.23,250 (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) లేదా విండ్‌ఫాల్ పన్ను కూడా విధించింది.  ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం వేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు భారత్. దేశ మార్కెట్ కు అవసరమైన   బంగారంలో చాలా వరకు దిగుమతుల ద్వారానే అందుతుంటుంది. ఈ పరిణామం భారత రూపాయి మారక విలువపై ఒత్తిడిని పెంచుతోంది. ఫలితంగా దేశీయ కరెన్సీ రోజుకో  రికార్డు కనిష్టానికి చేరుతోంది.