Delhi Schools : దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం వణికిస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు నవంబర్ 10 వరకు మూసివేస్తామని వెల్లడించింది. 6వతరగతి నుంచి 12 తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలల నిర్వాహకులు ఆన్లైన్ తరగతులు నిర్వహించవచ్చని తెలిపింది. ఈమేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ఓ ప్రకటన విడుదల చేశారు. నగరంలో గాలి నాణ్యత క్షీణించినందు వల్ల ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఒకవేళ ఈ కాలుష్య వాతావరణంలో ఆరుబయట తిరిగితే.. పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, కంటి వ్యాధుల ముప్పు ఉంటుందనే ఆందోళనతోనే వారిని నవంబరు 10 వరకు ఇళ్లలోనే ఉంచాలని నిర్ణయించినట్లు ఢిల్లీ విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.
We’re now on WhatsApp. Click to Join.
వాయు కాలుష్యం ఎఫెక్ట్తో ఇవాళ కూడా ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత పడిపోయింది. ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 460గా నమోదైంది. హస్తినలోని కొన్ని ప్రాంతాల్లోనైతే ఏక్యూఐ 500 దాకా చేరింది. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఏక్యూఐ..ద్వారకా సెక్టర్ 8లో 490, బవానాలో 479, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 484, సిరి ఫోర్ట్లో 478గా నమోదైంది. ఎన్సీఆర్లో భాగమైన నోయిడా కూడా తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇవాళ నిద్రలేచింది. అక్కడ ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఏక్యూఐ 400 దాటింది. ఎన్సీఆర్లో భాగమైన గురుగ్రామ్లోనూ తీవ్ర వాయు కాలుష్యం(Delhi Schools) ఉంది.