Exit Polls : ఎన్నికలు ముగిశాక వచ్చే ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. వాటిలో వచ్చే రిజల్ట్ ఆధారంగా గెలవబోయేది ఎవరు ? ఓడబోయేది ఎవరు ? అనే దానిపై ఒక అంచనాకు వస్తుంటారు. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్కు కేంద్ర ఎన్నికల సంఘం పలు కండీషన్లు పెట్టింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్(Exit Polls) నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని మీడియా సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ఫలితాల గురించి అంచనాలతోపాటు ఎలాంటి సర్వేలనూ ప్రసారం చేయకూడదని తేల్చి చెప్పింది. లోక్సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోపాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నాయి. 543 లోక్సభ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 1వ దశ పోలింగ్ ఏప్రిల్ 19న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న 5వ దశ, మే 25న 6వ దశ, జూన్ 1న చివరి, 7వ దశ ఎన్నికలు జరుగుతాయి.