PM Modi : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బలంగా కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది కాంగ్రెస్ వాళ్లే అంటూ ఆయన నిప్పులు చెరిగారు. నాడు ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన నిరంకుశ ఎమర్జెన్సీకి నేటితో 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ఈమేరకు వివరాలతో ఇవాళ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మోడీ సుదీర్ఘ పోస్ట్లు పెట్టారు. ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ ఇవాళ నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఎమర్జెన్సీ కాలం నాటి సంకుచిత, కుటిల మనస్తత్వం కాంగ్రెస్ నేతల్లో ఇంకా సజీవంగానే ఉంది. రాజ్యాంగంపై తమకున్న అయిష్టాన్ని దాచిపెట్టి వారు ఇప్పుడు నటిస్తున్నారు’’ అని మోడీ(PM Modi) కామెంట్ చేశారు.
Today is a day to pay homage to all those great men and women who resisted the Emergency.
The #DarkDaysOfEmergency remind us of how the Congress Party subverted basic freedoms and trampled over the Constitution of India which every Indian respects greatly.
— Narendra Modi (@narendramodi) June 25, 2024
We’re now on WhatsApp. Click to Join
ఎమర్జెన్సీని విధించి దేశ ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అణగదొక్కిందని ప్రధాని మోడీ విమర్శించారు. ‘‘ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు దేశం మొత్తాన్ని నాటి ఇందిర సర్కారు జైల్లో పెట్టింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్లను హింసించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆనాడు దారుణమైన విధానాలను కాంగ్రెస్ అమల్లోకి తెచ్చింది’’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
‘‘ఎమర్జెన్సీ టైంలో ప్రతికా స్వేచ్ఛను నాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో బిల్లులు తీసుకొచ్చింది. ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది’’ అని మోడీ తెలిపారు. ‘‘కాంగ్రెస్ నాయకుల మనసులోని మాట ఏమిటో దేశ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే వారిని ఎన్నికల్లో పదేపదే తిరస్కరిస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.