Prashant Kishor : కాంగ్రెస్‌కు పీకే కీల‌క సూచ‌న‌లు.. అలా చేయ‌క‌పోతే క‌ష్ట‌మే..

అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వడానికి నానా క‌ష్టాలూ ప‌డుతోంది.

  • Written By:
  • Publish Date - April 17, 2022 / 11:28 AM IST

అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వడానికి నానా క‌ష్టాలూ ప‌డుతోంది. ఇప్ప‌టికే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం చ‌విచూడ‌టంతో త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై క‌న్నేసింది. ఇందులో భాగంగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిశోర్ సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, ఆ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) మధ్య శనివారం చర్చించిన కీలక అంశాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ లో చేరి నాయకుడిగా పనిచేయాలని పీకేను సోనియాగాంధీ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరొచ్చని తెలిపాయి.

ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణతో కూడిన ఒక నివేదికను పీకే సమర్పించారు. లోక్ సభ ఎన్నికల ముందు పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులను సూచించారు. ముఖ్యంగా సమాచార సంబంధాల విభాగాన్ని పూర్తిగా సంస్కరించాలన్నది ఆయన సూచన. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెట్టాలని కోరారు. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు.

‘‘ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదన అందించారు. పార్టీ నేతల బృందం దీన్ని చూస్తుంది. ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించేది పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు’’అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ముఖ్యంగా 370 లోక్ సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాని.. మిగిలిన స్థానాల్లో పొత్తులతో వెళ్లొచ్చని పీకే సూచించారు. యూపీ, బీహార్, ఒడిశాలో ఒంటరిగా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో పొత్తులతో వెళ్లొచ్చన్నారు.