Elections Schedule : ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల నగారా రేపు (శనివారం) మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మీడియా సమావేశం నిర్వహించి ఎన్నిల షెడ్యూల్ను అనౌన్స్ చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ప్రెస్మీట్ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈవివరాలను ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు.లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పుడు కొనసాగుతున్న లోక్సభ గడువు జూన్ 16తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం టీమ్.. ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. ఆ సమాచారం ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ను రెడీ చేసింది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పట్లో ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడతల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను అనౌన్స్ చేశారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పనిచేయాల్సి ఉంటుంది.
2019లో ఆంధ్రప్రదేశ్కు మొదటి విడతలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి ఏపీ, తెలంగాణలకు ఒకే విడతలో ఎన్నికలుంటాయా ? లేదా ? అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. రేపు ఓ వైపు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుండగా.. మరోవైపు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. దీంతో ఏపీలో ఎన్నికల సందడి సంతరించుకుంది.