భారత్పై పడే భారం..
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్కు ఈ ధరల పెరుగుదల గొడ్డలిపెట్టులా మారింది. గతేడాది 160 బిలియన్ డాలర్ల మేర చమురును భారత్ దిగుమతి చేసుకుంది. గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర కేవలం ఒక్క డాలర్ పెరిగినా, భారత్ ఏడాదికి అదనంగా రూ.13,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుండగా, అందులో 1.5 నుంచి 2 మిలియన్ బ్యారెళ్లు వివాదాస్పద హార్మూజ్ జలసంధి గుండానే దిగుమతి అవుతోంది. ఇప్పటికే రష్యా నుంచి సరఫరా తగ్గడంతో పశ్చిమాసియాపై ఆధారపడిన భారత్కు ఇప్పుడు ఈ యుద్ధం భారీ ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చేలా కనిపిస్తోంది.
మరో 74 రోజుల వరకు బేఫికర్..
చమురు సరఫరాకు ఆటంకం కలిగినా తట్టుకునేందుకు భారత్ వద్ద వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గతంలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో దేశ అవసరాలకు 74 రోజుల పాటు ఈ నిల్వలు సరిపోతాయి. అయితే, యుద్ధం దీర్ఘకాలం కొనసాగి ధరలు ఇలాగే పెరిగితే మాత్రం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడిపై ధరల భారం పడే ప్రమాదం ఉంది.
