Delhi Traffic Police : G20 సమావేశాలు.. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

G20 శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు, అధికారులు వస్తుండటంతో సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రజలకు తెలియచేశారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు(Delhi Traffic Police).

  • Written By:
  • Publish Date - September 2, 2023 / 07:30 PM IST

ఢిల్లీ(Delhi)లో సెప్టెంబర్ 9,10 తేదీల్లో G20 శిఖరాగ్ర సమావేశాలు(G20 Summit 2023) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. ప్రపంచ దేశాధినేతలు ఈ సమావేశాలకు రానుండటంతో ఢిల్లీ మొత్తం భద్రతా సిబ్బంది చేతిలోకి తీసుకుంటున్నారు. అన్ని ప్రాంతాలను సెర్చ్ చేస్తున్నారు. అలాగే రెండు రోజుల ముందు నుంచే ఢిల్లీ లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Control) ఉండనున్నాయి.

G20 సమావేశాల సందర్భంగా ఢిల్లీలో నేడు ట్రాఫిక్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. G20 శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు, అధికారులు వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రజలకు తెలియచేశారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు(Delhi Traffic Police).

నియంత్రిత జోన్‌లోకి ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సిబ్బంది, వైద్య నిపుణులు, పారా-మెడిక్స్ వారి ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఇస్తున్నారు. అన్ని రకాల వాణిజ్య వాహనాలు, బస్సులు రింగ్ రోడ్ దాటి ఢిల్లీ సరిహద్దుల వైపు రోడ్ నెట్‌వర్క్‌లో అనుమతి. విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌లు , ISBTలకు ప్రయాణీకులకు అనుమతి ఇవ్వనున్నారు. న్యూ ఢిల్లీ జిల్లాలో హోటళ్లు, ఆసుపత్రులు వెళ్లే హౌస్ కీపింగ్, క్యాటరింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ వాహనాలకు వెరిఫికేషన్ తర్వాతే అనుమతి ఇవ్వనున్నారు.

G20 సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రగతి మైదాన్ పరిసర ప్రాంతాల్లోకి ప్రైవేట్ వాణిజ్య వాహనాలకు అనుమతి లేదు. ఢిల్లీలోని మెట్రో సేవలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటలవరకు సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్‌ ఒక్కటి మాత్రం అందుబాటులో ఉండదు. ప్రజలు ప్రజా రవాణా కోసం మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని, సెంట్రల్ ఢిల్లీలో ప్రజా రవాణా కోసం కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారు.

సోషల్ మీడియా ద్వారా కూడా ట్రాఫిక్ ఆంక్షలపై ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే G 20 ప్రతినిధులు ఇండియా గేట్, రాజ్‌ఘాట్,నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ , ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న నేపద్యంలో ఆయా రూట్లలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

 

Also Read : Countries Race To Sun : సూర్యుడిపై రీసెర్చ్ రేసులో ఉన్న దేశాలివీ..