Delhi Air Quality: ఢిల్లీ-ఎన్సిఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) సహా దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగను జరుపుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రంతా భారీగా బాణాసంచా కాల్చడంతో మరుసటి రోజు ఉదయం రాజధానిలో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్సిఆర్ను పొగమంచు దుప్పటి (Delhi Air Quality) కప్పేసింది. ఇది సాధారణ పొగమంచు కాదు కాలుష్యం వల్ల ఏర్పడిన పొగ. బాణాసంచా, టపాసుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత విపరీతంగా తగ్గిపోయి ‘రెడ్ జోన్’ (అత్యంత ప్రమాదకర స్థితి)కి చేరుకుంది.
కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) బులిటెన్ ప్రకారం.. ఢిల్లీలో ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత సూచీ (AQI) 352గా నమోదైంది. ఇది ‘అత్యంత చెత్త’ (Very Poor) కేటగిరీ కిందకు వస్తుంది. ఉదయం 5 గంటలకు ఇది 346, 6 గంటలకు 347, 7 గంటలకు 351గా నమోదైంది.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్గా ప్రకటించిన బీసీసీఐ!
ఏక్యూఐ (AQI) ప్రమాణాలు ఏమిటి?
సున్నా నుంచి 50 మధ్య ఏక్యూఐ ఉంటే ‘మంచి’ (Good), 51 నుంచి 100 మధ్య ఉంటే ‘సంతృప్తికరం’ (Satisfactory), 101 నుంచి 200 మధ్య ‘మధ్యస్థం’ (Moderate), 201 నుంచి 300 మధ్య ‘చెత్త’ (Poor), 301 నుంచి 400 మధ్య ‘అత్యంత చెత్త’ (Very Poor), 401 నుంచి 500 మధ్య ‘తీవ్రమైన’ (Severe) కాలుష్యంగా పరిగణిస్తారు.
ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ‘రెడ్ జోన్’లో
దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్సిఆర్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ‘గ్రీన్ క్రాకర్స్’ ఉపయోగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే చాలా మంది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకున్నారు. సీపీసీబీ గంటవారీ డేటా ప్రకారం.. ఢిల్లీ ఏక్యూఐ అర్ధరాత్రి 12 గంటలకు 349, 1 గంటకు 348గా ఉంది. సోమవారం రాజధానిలోని 38 పర్యవేక్షణ కేంద్రాలలో 36 కేంద్రాలు కాలుష్య స్థాయిని ‘రెడ్ జోన్’లో నమోదు చేశాయి. భారీ కాలుష్యం కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ‘అత్యంత చెత్త’ స్థాయి నుండి ‘తీవ్రమైన’ స్థాయికి చేరుకుంది.