Covishield Row: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి జారీ చేసే కొవిన్ సర్టిఫికెట్లపై ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఉండేది. కానీ ఇప్పుడది కనిపించడం లేదు. ‘‘మనమంతా కలిసి పోరాటం చేస్తే భారత్ కొవిడ్ 19ని ఓడించగలుగుతుంది’’ అని ప్రధాని మోడీ ఇచ్చిన సందేశంతో పాటు ఆయన ఫొటో కూడా సర్టిఫికెట్పై ఉండేది. ప్రస్తుతం కొవిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫొటో లేదు. కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే ఉందంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join
దేశంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాని పాటించే క్రమంలోనే కొవిన్ సర్టిఫికెట్లలో ప్రధాని మోడీ ఫోటోను తొలగించామని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాల అమలులో భాగంగానే కొవిన్ సర్టిఫికెట్ నుంచి మోడీ ఫోటోను తీసేశామని తెలిపాయి.
ఇటీవల కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) కరోనా వ్యాక్సిన్ వ్యవహారం యావత్ ప్రపంచంలో కలకలం రేపింది. ఈ టీకా తీసుకున్న పలువురిలో అరుదైన సైడ్ ఎఫెక్టులు తలెత్తాయని స్వయంగా ఆస్ట్రాజెనెకా కంపెనీ అంగీకరించింది. ఈమేరకు రాత పూర్వక వివరణను బ్రిటన్ కోర్టుకు సమర్పించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను మన దేశంలో కొవిషీల్డ్ పేరుతో తయారు చేసి పంపిణీ చేశారు. అందుకే ఆస్ట్రాజెనెకా ప్రకటన గురించి తెలుసుకొని మన ఇండియన్స్ కూడా హైరానా పడ్డారు. ఈ గందరగోళం వల్లే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై నుంచి ప్రధాని మోడీ ఫొటోను(Covishield Row) తీసేశారనే ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నడుమ డిస్కషన్ కూడా జరిగింది.
జామీ స్కాట్ అనే బ్రిటన్ వ్యక్తి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకోగా.. ఆయన మెదడులో సమస్యలు తలెత్తాయి. దీంతో 2021 ఏప్రిల్లో బ్రిటన్లోని కోర్టును ఆశ్రయించారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టు వల్ల ఈయన శరీరంలో రక్తం గడ్డకట్టిందని, ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోయిందని తేలింది. ఈ సమస్యలన్నీ కలుపుకొని వైద్య పరిభాషలో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇతడు బ్రిటన్ హైకోర్టులో వేసిన పిటిషన్కు ఆస్ట్రాజెనెకా కంపెనీ బదులిస్తూ.. ఆస్ట్రాజెనికా టీకా వల్ల సైడ్ ఎఫెక్టులు రావడం చాలా అరుదు అని స్పష్టం చేసింది.