ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహిళా ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన కాన్పూర్ లో జరిగింది. కాన్పూర్ క్రైం బ్రాంచ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ గుప్తా ట్విట్టర్ లో ప్రధానితోపాటు మహిళా ఐఎఎస్ అధికారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు వివాదస్పద ట్వీట్లకు రీట్వీట్ కూడా చేశాడు.
వీటికి సంబంధించి స్క్రీన్ గ్రాబ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. కాన్పూర్ హెడ్ క్వార్టర్స్ కూడా ఈ విషయాన్ని గుర్తించడంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసింది. అజయ్ గుప్తా చాలా కాలంగా కమిషనరేట్ క్రైం బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 14న పోలీసు పతకాలను ప్రకటించారు. పతక జాబితాకు సంబంధించి అజయ్ గుప్తా సోషల్ మీడియాలో కమిషనరేట్ అధికారులు, డీజీపీని ప్రశ్నించాడు. దీనికి కమిషనరేట్ పోలీసులు సమాధానం కూడా ఇచ్చారు.
ఈ లోపు అజయ్ పాత ట్వీట్లు బయటకొచ్చాయి. వీటిపై స్పందించిన అతను ప్రధాని, మహిళా ఐఏఎస్ అధికారిపైనా అవమానకర వ్యాఖ్యలు చేశాడు. తన ట్వీట్స్ వైరల్ కావడంతో అజయ్ తన ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ట్వీట్ స్క్రీన్ షాట్, యూఆర్ఎల్ లను అధికారులు సేవ్ చేశారు. విచారణ తర్వాత అడిషనల్ సీపీ ఆనంద్ అతన్ని సస్పెండ్ చేశారు.