Congress Vs BJP : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ తేదీపై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. రామాలయ ప్రారంభోత్సవం ధర్మశాస్త్రాలు, విధివిధానాల ప్రకారం జరగటం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిర్మాణ పనులు పూర్తికాక ముందే.. ఆలయాన్ని ప్రారంభించడం మంచిది కాదని దేశంలోని నాలుగు పీఠాల శంకరాచార్యులు ఇచ్చిన సూచనలను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు పక్కనపెట్టిందని పేర్కొంది. ఆలయ ప్రారంభ తేదీని పంచాంగం చూడకుండా.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఆరోపించారు. ఈ గొప్ప పనిని బీజేపీ ఓ రాజకీయ కార్యక్రమంగా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. ‘‘ఆలయ ప్రాణప్రతిష్ఠకు విధివిధానాలు ఉంటాయి. కానీ నాలుగు పీఠాల శంకరాచార్యుల సలహాలు, మార్గనిర్దేశం పరిగణనలోకి తీసుకోలేదు. ధర్మ శాస్త్రాలపరమైన సూచనలను పక్కనపెట్టి ఈ కార్యక్రమాన్ని ఫక్తు పొలిటికల్ ఈవెంట్గా మార్చేశారు. ఈ రాజకీయ కార్యక్రమంలో భక్తులకు, దేవుడికి మధ్య రాజకీయ పార్టీ కార్యకర్త మధ్యవర్తిగా ఉంటే వాళ్లను ఎందుకు భరించాలి? బీజేపీ ఏ పంచాంగం చూసి ఆ తేదీని నిర్ణయించింది? ఎన్నికల లెక్క ప్రకారమే ఈ డేట్ ఫిక్సయిందని అనిపిస్తోంది’’ అని పవన్ ఖేడా(Congress Vs BJP) ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసమని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. మతంలో రాజకీయాలను కలపకూడదన్నారు. కానీ భారతదేశంలో మతాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బీజేపీ ప్రజలను కులం, మతం, భాషల వారీగా విభజించిందని కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాతే పేర్కొన్నారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విశ్వాసాన్ని అత్యున్నతమైనదిగా పరిగణిస్తుంది. అందుకే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది’’ అని కేరళలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ తెలిపారు. బీజేపీ, సంఘ్ పరివార్ రాజకీయం చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ హాజరుకాకపోవడంపై బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ‘‘ఇది వాళ్ల అహంకారం. ఇందులో కొత్తేమీ లేదు. వారు పార్లమెంటు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించారు. అందుకే ప్రజలు కూడా కాంగ్రెస్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారు అలాంటి పరిస్థితిలో ఉన్నారు’’ అని నఖ్వీ తెలిపారు.