CISF Security: లోక్సభ భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనం భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. లోక్సభ, రాజ్యసభ భవనాల భద్రతను సీఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ భవన సముదాయాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దీంతో పార్లమెంట్కు సీఐఎస్ఎఫ్ భద్రత మరియు అగ్నిమాపక విభాగం రక్షణ కల్పిస్తుందని పార్లమెంట్ అధికారిక వర్గాలు తెలిపాయి. సిఐఎస్ఎఫ్లోని ప్రభుత్వ భవన భద్రతా విభాగానికి చెందిన కొంతమంది నిపుణులు, ప్రస్తుత పార్లమెంట్ భవనంలోని భద్రతా బృందంలోని అధికారులతో పాటు భద్రతా దళాల అగ్నిమాపక మరియు ప్రతిస్పందన అధికారులతో కలిసి ఈ వారంలో సర్వే నిర్వహించనున్నారు.
కేంద్రం నిర్ణయం మేరకు కొత్త, పాత పార్లమెంట్ భవన సముదాయాలు, వాటి అనుబంధాలు రెండూ సీఐఎస్ఎఫ్ భద్రత పరిధిలోకి వస్తాయి. CISFలో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ (PSS), ఢిల్లీ పోలీస్ మరియు పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (PDG) కూడా ఉన్నాయి. CISF అనేది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలు, న్యూక్లియర్ మరియు ఏరోస్పేస్ డొమైన్లు, విమానాశ్రయాలు మరియు ఢిల్లీ మెట్రో ఇన్స్టాలేషన్లకు భద్రతను అందిస్తుంది.
ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాళ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ పార్లమెంట్ సముదాయం భద్రతా అంశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ భద్రత మొత్తం సీఐఎస్ ఎఫ్ కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Also Read: Congress Vs MIM: అసెంబ్లీలో మాటల యుద్ధం, అక్బర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్!