PM Kisan – Hike : ‘పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతోందా ? లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ ఈమేరకు ప్రకటన చేయబోతోందా ? అనే ప్రచారానికి తెరపడింది. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం కింద రైతులకు ఏటా అందించే రూ.6వేల పెట్టుబడి సాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ‘పీఎం కిసాన్’ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాల్లో ఒకటని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే రైతులు pmkisan-ict@gov.in ఈమెయిల్ ఐడీలో సంప్రదించవచ్చని చెప్పారు. PM కిసాన్ యోజన హెల్ప్లైన్ నంబర్ 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 ద్వారా కూడా సంప్రదించవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
2018 సంవత్సరం నుంచి దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6వేలు చొప్పున కేంద్రం పంపిణీ చేస్తోంది. రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని అర్హులైన 11 కోట్ల మందికిపైగా రైతులకు 15 ఇన్స్టాల్మెంట్లలో రూ.2.81లక్షల కోట్లు పంపిణీ చేశారు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలతో పాటు గృహ అవసరాలకు సంబంధించిన ఖర్చులను చూసుకునేలా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’(PM Kisan – Hike) పథకం లక్ష్యం.