Tahawwur Rana: కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత పర్యటనకు రావడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు కెనడా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన కుట్రదారులలో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను కెనడా ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం.
ఎవరు ఈ తహవ్వుర్ హుస్సేన్ రాణా?
64 ఏళ్ల తహవ్వుర్ హుస్సేన్ రాణా కెనడా పౌరుడు. 2008 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి డేవిడ్ కోల్మన్ హెడ్లీ (అమెరికా పౌరుడు)కి ఇతను అత్యంత సన్నిహితుడు. పాకిస్థాన్లో జన్మించిన రాణా ప్రస్తుతం భారత కస్టడీలో ఉన్నాడు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ జరిపిన ముంబై దాడుల కేసులో ఇతను విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ దాడుల్లో 160 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా నుండి భారత్కు అప్పగింత
ముంబై దాడుల మాస్టర్మైండ్ రాణాను అమెరికా ఏప్రిల్ 2025లో భారత్కు అప్పగించింది. న్యూఢిల్లీ చేరుకోగానే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడిని అరెస్టు చేసింది. కాగా కెనడా పౌరసత్వ రద్దుకు కేవలం ఉగ్రవాద కార్యకలాపాలే కాకుండా అతను అప్లికేషన్ ఫారమ్లో అబద్ధాలు చెప్పడం కూడా ప్రధాన కారణంగా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (IRCC) పేర్కొంది.
Also Read: మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!
తప్పుడు సమాచారంతో పౌరసత్వం
2000 సంవత్సరంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గత నాలుగేళ్లలో తాను ఒట్టావా, టొరంటోలో నివసించానని కేవలం 6 రోజులు మాత్రమే దేశం వెలుపల ఉన్నానని రాణా పేర్కొన్నాడు. అయితే RCMP దర్యాప్తులో అతను ఆ సమయమంతా అమెరికాలోని చికాగోలో గడిపినట్లు తేలింది. అక్కడ అతనికి ఆస్తులు మరియు వ్యాపారాలు ఉన్నాయి. అతను ‘తీవ్రమైన మరియు ఉద్దేశపూర్వక మోసానికి’ పాల్పడ్డాడని అధికారులు ఆరోపించారు. ఒకవేళ అప్పుడే నిజమైన సమాచారం ఇచ్చి ఉంటే అతనికి కెనడా పౌరసత్వం లభించేది కాదని వారు స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితి
మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కెనడా ఫెడరల్ కోర్టులో ఉంది. పౌరసత్వం మోసపూరితంగా పొందిందా లేదా అనేది కోర్టు తేల్చనుంది. మరోవైపు రాణా తరపు న్యాయవాదులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, ఇది అతని హక్కులను ఉల్లంఘించడమేనని వాదిస్తున్నారు.
