మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం (Maharashtra Election Campaign) తుది దశకు చేరుకోవడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసాయి. కేవలం ఆ రాష్ట్రాల నేతలనే కాకుండా పక్క రాష్ట్రాల పాపులర్ నేతలను బరిలోకి దింపి ఎవరికీ వారు ఓటర్లను ఆకట్టుకునేపనిలో పడ్డారు. రేపు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు (Telugu CM) ప్రచారం చేయబోతుండడం విశేషం.
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) రేపటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న ఆయన..రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం రేపటి నుంచి మూడు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీయే తరుపున చంద్రబాబు, ఎంవీఏ తరుపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. వీరితో పాటు పవర్ స్టార్ , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం బిజెపి తరుపున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపును ఎన్డీయే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో విస్తృతంగా ప్రచారం చేయించాలని ప్లాన్ చేసింది. ఇక సీఎం రేవంత్ సైతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహారాష్ట్ర ఓటర్లకు వివరించనున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ తీరును వివరించి.. ఎంవీయే కూటమిని ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కోరనున్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలు ప్రచారంలోకి దిగుతుండడం తో ప్రచార వేడి మరింత పెరగబోతుంది.
Read Also : Chanakya Niti : జీవితంలోని ఈ అంశాల్లో సిగ్గుపడకండి..!