Site icon HashtagU Telugu

Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు

Niti Aayog Meet

Niti Aayog Meet

Niti Aayog Meet: ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ ముఖ్యమైన సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొనలేదు.ఈ సమావేశానికి బీహార్ నుండి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి మరియు విజయ్ కుమార్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గైర్హాజరు కావడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకుండా నితీష్ కుమార్ తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరుకాలేదు. బీహార్ నుండి అప్పటి ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా ఉప ముఖ్యమంత్రులిద్దరూ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లారని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు.బీహార్‌కు చెందిన నలుగురు కేంద్ర మంత్రులు కూడా కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇకపోతే ఈ సమావేశానికి నితీష్ కుమార్ హాజరుకాకపోవడానికి గల కారణాలపై రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. కమిషన్ తొమ్మిదో పాలక మండలి సమావేశంలో ‘అభివృద్ధి చెందిన భారతదేశం@2047’ పత్రంపై వివరంగా చర్చించారు. నీతి ఆయోగ్ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని అభివృద్ధి చెందిన భారతదేశం కోసం తమ ఆలోచనలను పంచుకున్నారు.

నితీష్ కుమార్ గైర్హాజరు అవ్వడం మరీ ముఖ్యంగా మమతా బెనర్జీ సమావేశానికి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే మమతా బెనర్జీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. సభలో మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తన వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ప్రయత్నించానని, అయితే తనకు 5 నిమిషాలు మాత్రమే ఇచ్చారని, ఇతరులు 10-20 నిమిషాలు మాట్లాడారని ఆమె అన్నారు. ఈ పరిస్థితిని అవమానకరంగా అభివర్ణించిన మమత, ఇది బెంగాల్‌కే కాకుండా అన్ని ప్రాంతీయ పార్టీలకు అవమానకరమని అన్నారు.

Also Read: BRS Effect : కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఎత్తిపోత‌లు ప్రారంభం