World Cup Final : ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ వార్త విని చాలామంది మనస్థాపానికి గురయ్యారు. చాలా ఫీలయ్యారు. ఈక్రమంలోనే పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో 23 ఏళ్ల యువకుడు రాహుల్ లోహర్ సూసైడ్కు పాల్పడ్డాడు. ఇంటిలోని తన గదిలోనే అతడు ఉరివేసుకొని చనిపోయాడని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. బంకురాలోని బెలిటోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సినిమా హాల్ సమీపంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో రాహుల్ పనిచేసేవాడు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అతడు ఆదివారం షాపులో సెలవు కూడా తీసుకున్నాడు.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిందనే మనస్థాపానికి గురై.. రాహుల్ తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్కు జీవితంలో ఇతరత్రా సమస్యలేవీ లేవని కుటుంబీకులు తెలిపారు. ఆదివారం రాత్రి 11 గంటల టైంలో అతడు సూసైడ్ చేసుకొని ఉండొచ్చన్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సోమవారం ఉదయం బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్కు తరలించారు. అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ సూసైడ్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేరని తెలిసింది.