Largest Underground Station : భూమి నుంచి దాదాపు 22 మీటర్ల లోతులో ఒక భూగర్భ రైల్వే స్టేషన్ రెడీ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నిర్మాణ దశలో ఉన్న బేగంపూల్ స్టేషన్ ప్రత్యేకత ఏమిటంటే.. దేశంలోనే తొలిసారిగా నమో భారత్ రైలు, మెట్రో రైలు ఇక్కడ ఒకే ట్రాక్పై పరుగులు పెట్టనున్నాయి. ఈ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్లపై రెండు వైపులా రైళ్లు వెళ్లే సౌకర్యం ఉంది. దీని పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. బేగంపూల్తో పాటు మీరట్ సెంట్రల్, భైంసాలీలలో కూడా భూగర్భ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే బేగంపూల్ రైల్వే స్టేషన్లో ఉన్న రేంజీలో అక్కడ సౌకర్యాలు లేవు.
ఈ స్టేషన్ పొడవు 246 మీటర్లు కాగా, వెడల్పు 24.5 మీటర్లు. బేగంపూల్ భూగర్భ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు సులువుగా రాకపోకలు సాగించేందుకు 20 అత్యాధునిక ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్లో మెట్లతో పాటు ఐదు లిఫ్టులు నిర్మించనున్నారు. స్ట్రెచర్లను తీసుకెళ్లేందుకు అనువుగా లిఫ్ట్లను డిజైన్ చేయించారు.ఈ స్టేషన్లో నాలుగు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని మొదటి ఎగ్జిట్ గేట్ నిర్మించారు. సోటిగంజ్ వైపు నుంచి వచ్చే ప్రయాణికుల కోసం రెండో ఎగ్జిట్ గేటును ఏర్పాటు చేశారు. నేషనల్ ఇంటర్ కాలేజ్ వైపునకు మూడో గేటు నిర్మించగా, మీరట్ కంటోన్మెంట్ వైపు నాలుగో గేటు ఉంది. సరుకులను కొనేందుకు మీరట్ నగరంలోని బేగంపూల్ ప్రాంతానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. నమో భారత్, మెట్రో రైలు ప్రారంభమైతే అక్కడి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
నమో భారత్, మీరట్ మెట్రో రైళ్లు మీరట్ సౌత్, శతాబ్ది నగర్, బేగంపుల్, మోదీపురం స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. మీరట్ మెట్రో కోసం ఆ నగరంలో 23 కిలోమీటర్ల వ్యవధిలో మొత్తం 13 స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో మీరట్ సెంట్రల్, భైంసాలీ, బేగంపుల్ రైల్వే స్టేషన్లు భూగర్భంలో ఉన్నాయి. వచ్చే ఏడాదికల్లా ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.