Site icon HashtagU Telugu

Air India Flights : ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పున:ప్రారంభం – ఎయిర్ ఇండియా

Air India Flights To Resume

Air India Flights To Resume

జూన్ 12న జరిగిన బోయింగ్ AI 171 విమాన ప్రమాదం అనంతరం విధించిన ‘భద్రతా విరామం’ తరువాత, ఎయిర్ ఇండియా (Air India Flights) ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనుంది. తాజాగా ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొదటిగా కొన్ని మార్గాల్లో విమానాలు తిరిగి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నుంచి అన్ని అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నట్టు స్పష్టం చేసింది. అహ్మదాబాద్ నుండి లండన్ (హీత్రూ) వరకు వారానికి మూడు సార్లు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో ఢిల్లీ-లండన్, ఢిల్లీ-జూరిచ్, ఢిల్లీ-టోక్యో, ఢిల్లీ-సియోల్ వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో తగ్గించిన సర్వీసులను పునరుద్ధరించారు. ఈ మార్గాల్లో విమానాల సంఖ్యను మళ్లీ పెంచుతూ ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలను అందించేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైంది.

Teenmaar Mallanna : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు

బెంగళూరు-లండన్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-టొరంటో, ముంబై-న్యూయార్క్ వంటి పలు ప్రధాన రూట్లలో సర్వీసులు తాత్కాలికంగా తగ్గించబడ్డాయి. అలాగే అమృత్‌సర్-లండన్ (గ్యాట్విక్), గోవా-లండన్ (గ్యాట్విక్), బెంగళూరు-సింగపూర్, పూణే-సింగపూర్ వంటి మార్గాల్లో సెప్టెంబర్ 30 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య విమానాలు రద్దైన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ బుకింగ్ లేదా పూర్తి డబ్బు తిరిగి పొందే అవకాశం కల్పిస్తోంది. సేవలలో మార్పులపై ఎయిర్ ఇండియా క్షమాపణలు తెలుపుతూ, భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. ఈ పాక్షిక పునరుద్ధరణతో ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి 525 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు నడుపుతుండడం విశేషం.