New Parliament : కొత్త పార్లమెంటు భవనంలో ఇవాళ మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్ సభ సమావేశం, 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సందర్భం వేళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు స్పెషల్ గిఫ్ట్ లతో ఒక కిట్ ను ఇవ్వనుంది. ఈ కిట్ లో భారత రాజ్యాంగ ప్రతి ఉంది. దీనితో పాటు పాత పార్లమెంటు భవనం, కొత్త పార్లమెంటు భవనం ఫొటోలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం ఉన్నాయి. వీటన్నింటిని జనపనారతో చేసిన బ్యాగులో ఎంపీలకు అందించనున్నారు. ఈ బ్యాగుల ఫొటోలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ ప్రతితో ఈరోజు కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రధాని వెంట మిగతా ఎంపీలంతా రాజ్యాంగ ప్రతిని చేతపట్టి.. కొత్త పార్లమెంటులోకి అడుగు పెట్టనున్నారు.
మరోవైపు నూతన పార్లమెంటులో తొలి బిల్లుగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును మోడీ సర్కారు ప్రవేశపెట్టనుంది. దీనికి లోక్ సభ, రాజ్య సభల్లో ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కుతుంది. లోక్సభ, రాష్ట్రాల్లోని శాసనసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సెషన్ లోనే క్లియర్ చేసేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు (New Parliament) తెలుస్తోంది.