Manipur Border : హింసాకాండతో అట్టుడికిన మణిపూర్ లో శాంతిస్థాపన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుంచి తీవ్రవాదులు మణిపూర్ లోకి చొరబడుతున్నారని ఇంటెలీజెన్స్ నివేదికలు వచ్చిన నేపథ్యంలో బార్డర్ ఇష్యూపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఫోకస్ పెట్టారు. మణిపూర్-మయన్మార్ సరిహద్దు వెంట 70 కి.మీ. మేర కంచెను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు, రాష్ట్ర పోలీసులు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. మయన్మార్ బార్డర్ లో 70 కిలోమీటర్ల మేర అదనపు కంచె వేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఆ కంచెను వేస్తే మయన్మార్ నుంచి మణిపూర్ లోకి అక్రమ వలసదారులు చొరబడకుండా అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు.
ఫ్రీ మూవ్మెంట్ కు సంబంధించి భారత్-మయన్మార్ మధ్య గతంలో జరిగిన ఒప్పందం కారణంగా ఎలాంటి పత్రాలు లేకుండా బార్డర్ లో 16 కి.మీ మేర మయన్మార్, మణిపూర్ ప్రజలు తిరగొచ్చనే నిబంధన ఉంది. దీనికారణంగా అక్రమ వలసదారులు భద్రతా సిబ్బంది కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నారని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అంటున్నారు. మయన్మార్ నుంచి ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. అక్రమ వలసలకు ప్రధాన మార్గాలుగా మారిన కొన్ని సరిహద్దు ఏరియాల్లో కంచె వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్లోని ఐదు జిల్లాలు, మయన్మార్తో 390 కిలోమీటర్ల సరిహద్దును (Manipur Border) పంచుకుంటున్నాయి.