100 Terrorists: 6 నెలల్లో 100 మంది ఉగ్రవాదులు హతం.. 30 మంది పాకిస్తానీలే!

ఈ ఏడాది గత 6 నెలల వ్యవధిలో కశ్మీర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

  • Written By:
  • Publish Date - June 13, 2022 / 05:20 PM IST

ఈ ఏడాది గత 6 నెలల వ్యవధిలో కశ్మీర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో 30 మంది పాక్ ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఆదివారం (జూన్ 12న) పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్లోనూ ముగ్గురు లష్కరే తయ్యిబా ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. కశ్మీర్ లోయ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మరో 158 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.

వీరిలో సింహ భాగం మంది లష్కరే తయ్యిబా ఉగ్రమూకలేనని తెలుస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న 158 మంది ఉగ్రవాదుల్లో 83 మంది లష్కరే తయ్యిబాకు చెందినవారని అంటున్నారు. 38 మంది హిజ్బుల్ ముజాహిదీన్, 30 మంది జైషే మహ్మద్ ఉగ్రమూకలు కశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత సరిహద్దు వెంట డజన్ల కొద్దీ ఉగ్రవాదుల క్యాంప్ లు మళ్లీ యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. వాటికి పాక్ సైన్యం సహాయ సహకారాలను అందిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు కూడా శిక్షణ అందించి కశ్మీర్ పైకి ఉసిగొల్పే ప్రయత్నాల్లో పాక్ నిమగ్నమైందని పేర్కొంటున్నాయి. కశ్మీర్లో జరిగే అమర్ నాథ్ యాత్రలో అపశ్రుతులు సృష్టించేందుకు కూడా ఉగ్రవాదులు ప్రయత్నించే ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అమర్ నాథ్ కు వెళ్లే మార్గంలో మోహరించి ఉన్న భద్రతా దళాలు లక్ష్యంగా గ్రెనేడ్ దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని అంటున్నాయి.