Election Schedule 2024 : 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి రెండో వారంలో ఎలక్షన్ షెడ్యూల్ను ప్రకటించే ఛాన్స్ ఉంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ను రెడీ చేసినట్లు సమాచారం. పోలింగ్ తేదీలను మార్చి 9 తర్వాత కేంద్ర ఎన్నికల సంంఘం ప్రకటించే అవకాశంఉందట. ఈమేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలను నిర్వహించాలని ఈసీ (Election Schedule 2024) యోచిస్తోంది. దీనిపై చర్చించేందుకు మార్చి 8,9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎన్నికల సంఘం బృందం సమావేశం అవుతుందని భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులు.. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఆ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆ తర్వాత మార్చి 12, 13 తేదీల్లో ఎన్నికల సంఘం టీమ్ జమ్మూకశ్మీర్లో పర్యటించి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకోనుంది. తద్వారా లోక్సభతో పాటే కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానుంది. ఇవన్నీ పూర్తి చేసుకొని మార్చి నెల రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కసారి షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.