Site icon HashtagU Telugu

Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో మరో ఎన్‌కౌంటర్.. 16 మంది మావోయిస్టులు హతం

Maoists Encounter Security Forces Sukma Dantewada Border Min

Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా కెర్లాపాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉపంపల్లి కెర్లాపాల్ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, భద్రతా బలగాలతో కూడిన సంయుక్త టీమ్ మావోయిస్టుల ఆచూకీ కోసం శుక్రవారం రాత్రి నుంచే సుక్మా-దంతెవాడ సరిహద్దుల్లోని ఉపంపల్లి కెర్లాపాల్ అడవులను జల్లెడ పడుతోంది. ఈక్రమంలో శనివారం (మార్చి 29న) ఉదయం భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

Also Read :RSS Hedgewar : ఏప్రిల్ 1న ఆర్ఎస్ఎస్‌‌ వ్యవస్థాపకుడు ‌హెడ్గేవర్ జయంతి.. జీవిత విశేషాలివీ

ఇద్దరికి గాయాలు కావడంతో.. 

దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు(Maoists Encounter) మొదలయ్యాయి. ఇంకా ఫైరింగ్ కొనసాగుతోందని తెలిసింది.  ఇప్పటివరకు ఈ ఎన్‌కౌంటర్‌లో 16 మందికిపైగా మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు  బస్తర్ రేంజ్ ఐజీ (పోలీస్)  సుందర్ రాజ్.పి వెల్లడించారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం నారాయణపూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. గాయపడిన భద్రతా సిబ్బంది ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఈ ఆపరేషన్2లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

Also Read :Allu Arjun 22 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 22 ఏళ్ల సినీ జర్నీపై ఓ లుక్

2026 మార్చి 31లోగా మావోయిజాన్ని నిర్మూలిస్తాం  : అమిత్‌షా  

‘‘మావోయిస్టులపై మరో భీకర దాడి చేశాం. మా భద్రతా బలగాలు 16 మంది మావోయిస్టులను అంతం చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ‘‘2026 మార్చి 31కల్లా దేశంలోని మావోయిజాన్ని అంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మావోయిస్టులు ఇప్పటికైనా ఆయుధాలను వదిలేయాలి. హింసతో ఎవరూ ఏదీ సాధించలేరు. కేవలం శాంతి, వికాసంతోనే ఏదైనా సాధించగలం’’ అని హోం మంత్రి పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.