Curd: వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అందుకే చాలా మంది తమ భోజనంలో పెరుగును ఖచ్చితంగా చేర్చుకుంటారు. పెరుగులో ఉండే కాల్షియం, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొందరు మహిళలకు రాత్రి పూట పెరుగు తినడం ప్రమాదకరమని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళ పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే ప్రతికూల మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏయే మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?
కఫం సమస్య ఉన్నవారు: తరచుగా కఫం లేదా దగ్గు ఉంటే రాత్రి పూట పెరుగుకు దూరంగా ఉండాలి. రాత్రి పూట పెరుగు తినడం వల్ల ఉదయం నిద్రలేవగానే ముక్కు దిబ్బడ వేసినట్లుగా అనిపించవచ్చు.
శ్వాసకోశ సమస్యలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
గ్యాస్- జీర్ణ సమస్యలు: జీర్ణశక్తి బలహీనంగా ఉన్న మహిళలు రాత్రి వేళ పెరుగు తీసుకోకపోవడమే మంచిది. రాత్రి సమయంలో జీర్ణక్రియ (డైజెస్టివ్ ఫైర్) మందగించడం వల్ల పెరుగును అరిగించుకోవడం కష్టమవుతుంది.
Also Read: Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.
కీళ్ల నొప్పులు: కీళ్ల నొప్పులు లేదా గౌట్ సమస్యతో బాధపడే మహిళలు రాత్రి పూట పెరుగు తినడం వల్ల శరీరంలో వాపులు, నొప్పులు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ తినాలనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి.
సైనస్ సమస్య: సైనస్ ఉన్నవారికి రాత్రి పూట పెరుగు తింటే తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
రాత్రి పూట పెరుగు అస్సలు తినకూడదా?
రాత్రి పూట పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. పెరుగును సురక్షితంగా తీసుకోవాలంటే అందులో కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి కలుపుకోవాలి. దీనివల్ల పెరుగులోని చలువ చేసే గుణం వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి.
పెరుగు తినడానికి సరైన సమయం ఏది?
పెరుగు తినడానికి అత్యంత అనువైన సమయం పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో. ఈ సమయంలో పెరుగు సులభంగా జీర్ణమై శరీరానికి పూర్తి పోషకాలను అందిస్తుంది. రాత్రి వేళల్లో చల్లని పదార్థాలకు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
