Toilet Paper: నేటి ఆధునిక జీవనశైలిలో టాయిలెట్ పేపర్ వాడకం చాలా సాధారణమైపోయింది. ఇల్లు, ఆఫీసు, మాల్స్.. ఇలా ఎక్కడ చూసినా శుభ్రత కోసం దీనినే సులభమైన మార్గంగా భావిస్తున్నారు. పట్టణాల్లో దీనిని ఒక ఆధునిక, మెరుగైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. అయితే మనం రోజూ వాడే ఈ వస్తువు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఫిట్నెస్, డైట్, స్కిన్ కేర్ మీద దృష్టి పెడతారు. కానీ రోజువారీ పరిశుభ్రత అలవాట్లను నిర్లక్ష్యం చేస్తారు. ఈ చిన్న అలవాట్లే కాలక్రమేణా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి సరైన టాయిలెట్ పరిశుభ్రత పద్ధతులు ఏంటో, ఏ అలవాట్లను మార్చుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
టాయిలెట్ పేపర్ను ఎక్కువగా వాడటం వల్ల కలిగే నష్టాలు
సాధారణంగా శరీరంలోని కొన్ని భాగాల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అటువంటి చోట టాయిలెట్ పేపర్తో పదేపదే గట్టిగా రుద్దడం వల్ల చర్మంపై చిన్న చిన్న గీతలు పడటం లేదా మంట పుట్టడం వంటివి జరగవచ్చు. ఇవి వెంటనే కనిపించకపోయినా తర్వాత నొప్పి, దురద లేదా ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు. అందుకే గట్టిగా రుద్దే బదులు సున్నితంగా శుభ్రం చేసుకోవడం ఉత్తమం. వీలైతే శుభ్రత కోసం నీటిని ఉపయోగించడం చర్మానికి చాలా సురక్షితమైన మార్గం.
నీటితో శుభ్రం చేసుకోవడం ఎందుకు ఉత్తమం?
నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మురికి పూర్తిగా తొలగిపోవడమే కాకుండా చర్మానికి ఎటువంటి హాని కలగదు. నీటిని వాడటం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. అందుకే టాయిలెట్ ఉపయోగించిన తర్వాత నీటిని లేదా జెట్ స్ప్రేని వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల మెరుగైన పరిశుభ్రత లభించడమే కాకుండా చర్మం సురక్షితంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.
Also Read: హైదరాబాద్తో కోల్కతా మ్యాచ్.. కేకేఆర్కు హోం గ్రౌండ్ కలిసొస్తుందా?
టాయిలెట్ పేపర్ తప్పనిసరి అయితే…
ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయట ఉన్నప్పుడు నీరు అందుబాటులో లేకపోతే టాయిలెట్ పేపర్ వాడటం అనివార్యమవుతుంది. అలాంటప్పుడు పేపర్తో రుద్దే బదులు, సున్నితంగా అద్ది శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా పైల్స్, చర్మ సంబంధిత మంటలు ఉన్నవారు లేదా డెలివరీ అయిన వారు ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేయడం వల్ల అనవసరమైన గాయాలు లేదా ఇన్ఫెక్షన్ల నుండి బయటపడవచ్చు.
మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మహిళలు ప్రత్యేకంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. శుభ్రం చేసుకునేటప్పుడు ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు మాత్రమే తుడవాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారి నుండి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా టాయిలెట్కు వెళ్ళినప్పుడు రక్తం పడటం, విపరీతమైన నొప్పి లేదా నిరంతరం మంట వంటి లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అటువంటి సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం అవసరం.
