షుగర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. షుగర్ ఎక్కువగా తింటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. మార్కెట్లో ప్రస్తుతం దొరుకుతున్న చాలా రకాల తీపి పదార్థాలు షుగర్ తోనే తయారు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది సుగర్ ని డైరెక్ట్ గా తీసుకుంటే మరికొందరు స్వీట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఎలా తిన్నా కూడా షుగర్ వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. అందుకే షుగర్ ని వైట్ పాయిజన్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఇది మన ఆరోగ్యాన్నే కాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాల రూపంలో ఎక్కువ మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలాగే డయాబెటీస్, గుండె జబ్బులు కూడా వస్తాయట. చక్కెర మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందట. అందుకే మీరు ప్రతిరోజూ తీసుకునే చక్కెర పరిమాణాన్ని తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెర మొత్తాన్ని పరిమితం చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుందట.
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవసరమయ్యే భాగాల మొత్తాన్ని పెంచుతుందట. వీటిలో ఆక్సలేట్, కాల్షియం వంటి మూత్రంలోని కొన్ని పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు మూత్ర పిండాలు లేదా మూత్ర నాళంలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయట. పండ్లు తినడం వల్ల మొత్తం చక్కెర స్థాయిలు తగ్గడమే కాకుండా, వ్యాధితో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చేరడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మనలో చాలా మంది సోడా, జ్యూసులు వంటి పానీయాలను ఇష్టంగా రోజూ తాగుతుంటారు.
కానీ ఈ పానీయాలలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల లెప్టిన్ నిరోధకత ఏర్పడుతుందట. కాబట్టి కేవలం చక్కర స్వీట్లు పదార్థాలు మాత్రమే కాకుండా ప్రక్టోజ్ ఎక్కువగా ఉండే పానీయాలు కూడా తీసుకోకూడదట.. స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయట. అలాగే రక్తపోటు, హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందని చెబుతున్నారు.